కేసీఆర్ కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్‌.. ఎవ‌రు పెట్టారంటే!

ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీకి ముహూర్తం కుదిరింది. దసరా రోజున మధ్యాహ్నం 1:19 గంటలకు కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటించనున్నారు. విజయదశమి రోజున తెలంగాణ రాష్ట్ర స‌మితి కార్యవర్గ భేటీలో జాతీయ పార్టీకి ఆమోదం తెలపనున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలతో సమావేశమైన గులాబీ దళపతి.. జాతీయ పార్టీపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

దసరా రోజున మధ్యాహ్నం ఒంటి గంట 19 నిమిషాలకు కేసీఆర్‌ జాతీయ పార్టీపై ప్రకటన చేయబోతున్నారని.. సమావేశంలో పాల్గొన్న నేతలు తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రజలంతా కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని నేతలు అన్నారు. దేశవ్యాప్తంగా పలు పార్టీలు.. కేసీఆర్‌ జాతీయ పార్టీలో విలీనమయ్యేందుకు సిద్ధమయ్యాయని.. ఈ నెల 5న కొందరు నేతలు ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. డిసెంబర్‌ 9న ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

దసరారోజు జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసేందుకు గులాబీ దళపతి సిద్ధమవుతున్నారు. అదేరోజు టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు, రాష్ట్రకార్యవర్గ సమావేశం జరగనుంది. జాతీయపార్టీ ఏర్పాటు చేయాలని టీఆర్ ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం తీర్మానం చేయనుంది. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే 33 జిల్లాల అధ్యక్షులు ముక్తకంఠంతో కోరారు.

ముహూర్తం ఎవ‌రు పెట్టారు..?

ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మారిన విష‌యం ఇదే. జాత‌కాల‌ను.. జ్యోతిష్యాల‌ను సంపూర్ణంగా విశ్వ‌సించే తెలంగాణ సార‌థి.. కొత్త పార్టీ.. అందునా.. జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్న స‌మ‌యంలో అన్నీ చూసుకోకుండా.. ముందుకు వెళ్ల‌రు క‌దా! ఇప్పుడు కూడా అదే జ‌రిగింద‌ని రాజ‌కీయ పండితులు భావిస్తున్నారు. యాద‌గిరి ల‌క్ష్మీనృశింహ స్వామి ప్ర‌ధాన అర్చుకుల‌తోనే ఈ జాతీయ పార్టీకి ముహూర్తం ఫిక్స్ చేయించార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ ముహూర్తంపై.. సోష‌ల్ మీడియాలో విస్తృతంగా చ‌ర్చ‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.