కోమటిరెడ్డికి డ్యామేజీ తప్పదా ?

మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి బాగా డ్యామేజి అవుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ కు పెద్ద కాంట్రాక్టు సంస్ధలున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరారనే ఆరోపణలకు కొదవేలేదు. సరే రాజకీయాలన్నాక ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే అనుకున్నా ఇపుడు సొంత సంస్థ కార్మికులే ఆయన ఇజ్జత్ తీసేశారు.

సంస్ధలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కొన్ని నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదట. అందుకని వాళ్ళంతా రోడ్డెక్కారు. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ లో మట్టి తవ్వకాలు, రవాణా వ్యవహారాలు చూసే సుశీ హైటెక్ సంస్ధ కార్మికులు సుమారు 400 మంది ఆందోళనకు దిగారు. వీళ్ళంతా గడచిన వారంరోజులుగా పనికి వెళ్ళకుండా ఆందోళనలు చేస్తున్నారు. తమకు రెండు నెలలుగా రాజగోపాల్ జీత బత్యాలు సుమారు రు. 2 కోట్లు పెండింగ్ లో పెట్టినట్లు మండిపోతున్నారు.

పండుగ లోపే తమ జీత, బత్యాలతో పాటు పండగ బోనస్ కూడా ఇస్తే కానీ తాము పనిలోకి దిగేది లేదని జీఎం కార్యాలయం ముందు ఆందోళనలో డిమాండ్లు చేశారు. కార్మికులు రోడ్డెక్కకుండా యాజమాన్యం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కార్మికులు ఎప్పుడైతే ఆందోళన మొదలుపెట్టారో అప్పటినుండి మట్టి తవ్వకాలు, రవాణా అంతా ఆగిపోయింది. తమకివ్వాల్సిన జీతాలు నిలిపేసి మునుగోడు ఉపఎన్నికలో కోట్ల రూపాయలు ఖర్చులు చేయటంలో అర్ధమేంటని వీళ్ళంతా నిలదీస్తున్నారు.

రాజగోపాల్ సంస్ధ డబ్బులు ఇస్తేనే తాము వర్కర్లకు జీతాలు ఇవ్వగలమని హైటెక్ సంస్ధ యాజమాన్యం చెప్పింది. దాంతో ఇపుడు సమస్యంతా రాజగోపాల్ మెడకు చుట్టుకుంది. తమకు జీత, బత్యాలతో పాటు బోనస్ చెల్లించకపోతే శ్రీరాంపూర్ మైన్స్ నుండి బొగ్గును కూడా అడ్డుకుంటామని కార్మికులు బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఇపుడు కంపెనీ వ్యవహారాలు రచ్చకెక్కాయి. కార్మికులు, ఉద్యోగులు వ్యతిరేకంగా తయారవుతున్నారు. దీని ప్రభావం ప్రచారం మీద పడుతోంది. ఇపుడీ విషయాన్నే టీఆర్ఎస్, కాంగ్రెస్ బాగా హైలైట్ చేస్తున్నాయి.