మ‌ణిర‌త్నంకు ధ‌నుష్ షాక్?

ఏడేళ్ల కింద‌టి మాట‌. రాజ‌మౌళి మాగ్న‌మ్ ఓపస్ బాహుబ‌లి విడుద‌ల‌కు సిద్ధం కాగానే.. తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీ దానికి రెడ్ కార్పెట్ ప‌రిచేసింది. మ‌న ఇండ‌స్ట్రీకి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచే ఆ సినిమాకు పోటీయే ఉండ‌కూడ‌ద‌ని అన‌ధికారికంగా ఒక నిర్ణ‌యం జరిగిపోయింది. ఆ చిత్రం అనివార్య కార‌ణాల‌తో రెండు మూడుసార్లు వాయిదా ప‌డినా కూడా ఎవ‌రూ దానికి అడ్డం ప‌డే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఆల్రెడీ షెడ్యూల్ అయిన సినిమాలు ప‌క్క‌కు జ‌రిగాయి. అందులో శ్రీమంతుడు మూవీ కూడా ఒక‌టి. జులై 10 నుంచి ఆ చిత్రాన్ని నెల రోజులు వాయిదా వేసుకుని మ‌రీ బాహుబ‌లికి అవ‌కాశం ఇచ్చారు.

స్వ‌యంగా మ‌హేషే.. బాహుబ‌లి మ‌న ప్రైడ్ అని, ఎంతో క‌ష్ట‌ప‌డి, భారీ బ‌డ్జెట్లో తీసిన అలాంటి సినిమాకు ఇబ్బంది రాకూడ‌ద‌నే త‌న చిత్రాన్ని వాయిదా వేసుకున్నాన‌ని చెప్పాడు. తెలుగు అనే కాదు.. వేరే భాష‌ల్లో కూడా దీనికి పోటీ లేక‌పోయింది.

ఐతే ఇప్పుడు త‌మిళ బాహుబ‌లిగా భావిస్తున్న పొన్నియ‌న్ సెల్వ‌న్ ప‌రిస్థ‌తి దీనికి భిన్నంగా ఉంది. ఆ చిత్రానికి అన్ని భాష‌ల్లోనూ పోటీ త‌ప్ప‌ట్లేదు. స్వ‌యంగా త‌మిళంలోనే ఒక పేరున్న సినిమా దాంతో త‌ల‌ప‌డ్డానికి సిద్ధ‌మైంంది. ఆ చిత్రమే.. నానే వ‌రువేన్. ధ‌నుష్ ప్ర‌ధాన పాత్ర‌లో అత‌డి అన్న‌య్య అయిన స్టార్ డైరెక్ట‌ర్ సెల్వ రాఘ‌వ‌న్ రూపొందించిన చిత్ర‌మిది. దీని మీద మంచి అంచ‌నాలే ఉన్నాయి. వీళ్ల కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజే వేరు. అందులోనూ తాజాగా తిరుచిత్రాంబ‌ళం చిత్రంతో భారీ విజ‌యాన్నందుకున్న త‌ర్వాత ధ‌నుష్ నుంచి వ‌స్తున్న సినిమా అది. దీంతో పోలిస్తే పొన్నియ‌న్ సెల్వ‌న్ స్థాయి, క్రేజ్ ఎక్కువే కావ‌చ్చు. కానీ అలాంటి సినిమాకు ఏ ర‌కంగానూ పోటీ లేకుంటేనే బాగుంటుంది.

కానీ సెప్టెంబ‌రు 30న పొన్నియ‌న్ సెల్వ‌న్ రిలీజ‌వుతుండ‌గా.. ఒక రోజు ముందు ధ‌నుష్ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. మ‌రోవైపు హిందీలో విక్ర‌మ్ వేద లాంటి క్రేజీ మూవీ రిలీజ‌వుతుండ‌టం.. ఉత్త‌రాదిన పొన్నియ‌న్ సెల్వ‌న్‌కు ఇబ్బందిక‌ర‌మే. తెలుగులో కూడా ఒక‌ట్రెండు చిత్రాలు ఆ రోజు రిలీజ‌య్యే ప‌రిస్థితి కనిపిస్తోంది.