కాంగ్రెస్.. కోమటిరెడ్డి బ్రదర్స్ ను లైట్ తీసుకుందా ?

క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అలాగే అనుమానంగా ఉంది. మునుగోడు ఎంఎల్ఏకి, కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎప్పుడైతే రాజీనామా చేశారో వెంటనే అందరి దృష్టి అన్న, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైకి మళ్ళింది. ఎందుకంటే అన్నదమ్ములిద్దరు ఏ విషయంలో అయినా ఒకేమాట, ఒకేబాటగా ఉంటారు. రాజగోపాల్ పార్టీని వదిలేసి బీజేపీలో చేరుతారనే ప్రచారం ఎప్పటినుండో వినిపిస్తోంది. కొన్నిసార్లు ఆయనే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు.

తాజాగా కాంగ్రెస్ కు రాజీనామా చేసే ముందు, చేసిన తర్వాత రాజగోపాల్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. దానికి కౌంటర్ గా రేవంత్ కూడా ఆకాశమేహద్దుగా రెచ్చిపోయారు. అయితే ఎలాంటి సంబంధం లేకపోయినా మధ్యలో వెంకటరెడ్డి దూరారు. రేవంత్ తమను అవమానిస్తున్నాడంటు రెచ్చిపోయారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే వరదలు, నష్టపరిహారం పేరుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంకటరెడ్డి కలవటం.

నిజంగానే వరదలు, నష్టపరిహారంపైన మాత్రమే అమిత్ షాను కలవదలచుకుంటే మిగిలిన ఎంపీలను కూడా కలుపుకుని వెళ్ళుండేవారే. లేదా తన నియోజకవర్గం నుండి మద్దతుదారులతో కలిసి వెళ్ళుండాలి. కానీ అలా కాకుండా ఒంటరిగా వెళ్ళి కలవటంతోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదోరోజు బ్రదర్స్ బీజేపీలో చేరటం ఖాయమని పార్టీలోను బయటా ప్రచారం జరుగుతున్నదే. ఆ విషయమే ఇపుడు బహిరంగంగా చర్చ జరుగుతోందంతే.

దీనిపై వెంకటరెడ్డి స్పందిస్తూ తనను పార్టీలో నుండి తరిమేసే కుట్ర జరుగుతోందని గోల మొదలుపెట్టారు. వెంకటరెడ్డిని పార్టీ నుంచి తరిమేసేంత సీన్ పార్టీలో ఎవరికీ లేదని అందరికీ తెలుసు. తాను ఉండదలచుకుంటే ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారంతే. కాంగ్రెస్ ను వదిలేసి బీజేపీలోకి వెళ్ళిపోవటానికి డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే రేవంత్ టార్గెట్ గా రివర్స్ రాజకీయం మొదలుపెట్టారు. ఈ విషయాలు స్పష్టంగా కనబడుతుండటంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ను కాంగ్రెస్ లైట్ గా తీసుకుంటున్నట్లే అనిపిస్తోంది.