చరణ్ సినిమాకు మరో బ్రేక్

ఎన్నో ఏళ్ల నుంచి తెలుగులో ఓ సినిమా చేస్తానని చెబుతూ వచ్చిన తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్.. ఎట్టకేలకు గత ఏడాది రామ్ చరణ్ హీరోగా సినిమాను ప్రకటించాడు. గత ఏడాది చివర్లోనే అది సెట్స్ మీదికి కూడా వెళ్లింది. మధ్య మధ్యలో కొన్ని బ్రేక్‌లు వచ్చినప్పటికీ.. ఉన్నంతలో కొంచెం వేగంగానే చిత్రీకరణ పూర్తి చేసే ప్రయత్నంలో ఉంది చిత్ర బృందం.

ముందు వచ్చే సంక్రాంతికే ఆ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ.. ఆ డేట్‌ను అందుకోవడం కష్టమని భావించి వేసవికి వాయిదా వేశారు. కానీ ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే వచ్చే వేసవికి కూడా సినిమా రిలీజ్ కావడం సందేహమే అనిపిస్తోంది. రకరకాల కారణాల వల్ల ఆగిపోయిన ‘ఇండియన్-2’ సినిమాను పున:ప్రారంభించడానికి శంకర్ సిద్ధం కావడమే అందుక్కారణం. ముందేమో శంకర్.. చరణ్ సినిమాతో పాటు ఇండియన్-2 చిత్రీకరణను సమాంతరంగా చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ అలా చేయడం లేదన్నది తాజా సమాచారం.

చరణ్ సినిమాకు బ్రేక్ ఇచ్చి.. వరుస షెడ్యూళ్లలో ‘ఇండియన్-2’ బ్యాలెన్స్ పార్ట్ చిత్రీకరణ జరపనున్నాడట శంకర్. ఇది కూడా వందల కోట్ల బడ్జెట్‌తో ముడిపడ్డ సినిమా కావడం, ఆ చిత్రాన్ని తిరిగి ప్రారంభించడానికి కమల్, నిర్మాతలతో సహా అందరూ సిద్ధంగా ఉండడం.. ఎక్కువ ఆలస్యం చేయకుండా సినిమాను పూర్తి చేయాలని అందరూ ఒక నిర్ణయానికి రావడంతో శంకర్ అటు వైపు మళ్లక తప్పట్లేదు. సెప్టెంబరు రెండో వారంలో ఈ చిత్రం తిరిగిసెట్స్ మీదికి వెళ్లనుందట.

స్వయంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ విషయాన్ని నేహా ధూపియాతో ఒక వీడియో ఇంటర్వ్యూలో వెల్లడించింది. గత ఏడాది తల్లి కావడం వల్ల వేరే సినిమాల నుంచి తప్పుకున్న కాజల్.. ఇప్పటికే తన మీద చాలా సన్నివేశాలు చిత్రీకరించిన ‘ఇండియన్-2’ సినిమాలో మాత్రం కొనసాగాలనే అనుకుంటోంది. అందుకోసం ఆమె మళ్లీ కసరత్తులు కూడా మొదలుపెట్టినట్లు కూడా తెలుస్తోంది. పూర్వపు లుక్‌లోకి వచ్చి, కంటిన్యుటీ సమస్య లేకుండా చూడాలని కాజల్ భావిస్తోంది. ఇండియన్-2 పున:ప్రారంభం గురించి త్వరలోనే లైకా ప్రొడక్షన్స్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.