నారా లోకేష్ పాద‌యాత్ర‌.. ఎప్ప‌టి నుంచి అంటే!

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ త్వరలో పాదయాత్ర చేయ‌నున్నారు. దీనిపై  త్వ‌ర‌లోనే ఆయ‌న ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. మ‌హాత్మా గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని అక్టోబర్ 2వ తేదీ నుంచి పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతున్న లోకేష్‌.. సగానికిపైగా గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు అక్టోబర్ 2వ తేదీన పాదయాత్ర(వ‌స్తున్నా మీకోసం) ప్రారంభించారు. అదే తేదీ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తే బాగుంటుందని  పార్టీ శ్రేణులు లోకేష్‌కు చెబుతున్నట్లు సమాచారం.

కాగా పాదయాత్ర ప్రారంభిస్తే మధ్యలో బ్రేక్ ఉండకూడదని లోకేష్ భావిస్తున్నారు. మంగళగిరిలో ఇంటింటికి తిరుగుతున్న కార్యక్రమం పూర్తి చేసి పాదయాత్రకు వెళ్లాలని లోకేష్ అనుచరులు భావిస్తున్నట్లు తెలియవచ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించు కోవ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న అడుగులు వేయాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ స‌ర్కారు ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను లోకేష్ ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు. ముఖ్యంగా రాష్ట్రానికి చంద్ర‌బాబు మ‌రోసారి ముఖ్య‌మంత్రి కావాల్సిన అవ‌స‌రాన్ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు నొక్కి చెప్ప‌నున్నారు. అదేవిధంగా వైసీపీ స‌ర్కారు మోపుతున్న భారాల‌పైనా ఆయ‌న వివ‌రించ‌నున్నారు. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే రోడ్ మ్యాప్ ఇవ్వ‌నున్న‌ట్టు టీడీపీ నేత‌లు ప్ర‌క‌టించారు.

ఇదిలావుంటే.. మ‌రోవైపు టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా జిల్లాల యాత్ర‌లు ప్రారంభించ‌నున్నారు. ఇటీవ‌ల ప్రారంభ‌మైన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా నెలకు రెండు జిల్లాల్లో పర్యటించనున్నట్లు  చంద్రబాబు ప్ర‌క‌టించారు. మహానాడు విజయవంతం కావడంతో చంద్రబాబు ఖుషీగా ఉన్నారు. ఈ వేడిలోనే తాను కూడా జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు ముందుకు వెళ్లాల‌ని భావిస్తున్న‌ట్టు ముఖ్యనేతలకు తెలిపారు. వైసీపీ అరాచక, విధ్వంస పాలనపై  ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రిచేందుకు తాను త్వ‌ర‌లోనే రంగంలోకి దిగ‌నున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు.  

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రాజకీయాలకే అనర్హుడని.. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు పేర్కొన్నారు. మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాడేందుకు జిల్లాల యాత్ర దోహ‌ద ప‌డుతుంద‌ని కూడా ఆయ‌న భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పన్ను పోటు, ధరల భారంపై బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగుతోందని.. క్విట్ జగన్ సేవ్ అంధ్ర ప్రదేశ్ నినాదాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్తాన‌ని ఆయ‌న పార్టీ నాయ‌కుల‌కు వెల్ల‌డించారు. దీంతో అటు లోకేష్‌.. ఇటు చంద్ర‌బాబు కూడా యాత్ర‌ల‌కు రెడీ అవుతుండ‌డంతో టీడీపీలో అనూహ్య‌మైన ప‌రిణామాలు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.