ఫిక్సయిపోయారు.. ఐపీఎల్ ఫైనల్ ఫిక్సింగ్ అని

ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్‌కు కేరాఫ్ అడ్రస్ అని ఓ వర్గం క్రికెట్ అభిమానులు బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ప్రతి మ్యాచ్‌లోనూ ఏదో ఒక పాయింట్ పట్టుకుని మ్యాచ్ ఫిక్సయిందని ఆరోపణలు చేస్తుంటారు. ఐతే ఈ ఆరోపణలు, విమర్శలు, వ్యాఖ్యానాలు ఎప్పుడూ ఉండేవే కావట్టి అందరూ లైట్ తీసుకుంటూ ఉంటారు. ఈ ఐపీఎల్‌లో చివరి ప్లేఆఫ్ బెర్తును ఖరారు చేసే మ్యాచ్‌లో ముంబయి చేతిలో ఢిల్లీ ఓడిపోవడాన్ని చాలామంది అనుమానంగా చూశారు.

బెంగళూరును ఫైనల్ చేర్చడానికి ఢిల్లీ కావాలనే ఓడిపోయిందని, ఇదంతా ఫిక్సింగ్ అని సోషల్ మీడియాలో ఓ వర్గం అదే పనిగా ఆరోపించింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఫైనల్ విషయంలో ఇంకా పెద్ద స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. గుజరాత్ టైటిల్ గెలవడం ముందే ఫిక్స్ అయిపోయిందని.. ఊరికే మ్యాచ్ పేరుతో డ్రామా నడిచిందని ట్విట్టర్లో నెటిజన్లు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి ‘ఫిక్సింగ్’ అనే పదం ట్విట్టర్లో టాప్‌లో ట్రెండ్ అవుతుండటం గమనార్హం.

గుజరాత్ టైటాన్స్.. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీం అని, ఫైనల్ జరిగింది నరేంద్ర మోడీ పేరుతో ఉన్న స్టేడియంలో అని, హోం మంత్రి అమిత్ షా, ఆయన తనయుడైన బీసీసీఐ కార్యదర్శి జై షా సహా పలువురు బీజేపీ నేతలు ఈ మ్యాచ్‌కు అతిథులుగా హాజరవడం.. ఇదంతా చూపించి గుజరాతే టైటిల్ విజేత అంటూ మ్యాచ్ ఆరంభానికి ముందే ప్రచారం మొదలైంది.

ఈ ఐపీఎల్‌లో మొదట్నుంచి టాస్ గెలిచిన జట్టు బౌలింగే ఎంచుకుంటుండగా, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువ విజయాలు సాధించగా.. రాజస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం, ఆ తర్వాత మరీ నెమ్మదిగా ఆడి తక్కువ స్కోరుకు పరిమితం కావడం.. తర్వాత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ క్యాచ్‌ను తొలి ఓవర్లోనే చాహల్ వదిలేయడం.. లాంటి ఉదంతాలను చూపించి.. రాజస్థాన్ కావాలనే ఓడిపోయిందని.. గుజరాత్‌‌కు కప్పు అందించడానికే ఇదంతా అని.. మ్యాచ్ పూర్తిగా ఫిక్సింగే అని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఐతే ఈ సీజన్లో మొదట్నుంచి గుజరాత్ అదరగొడుతున్న వైనం చూశాక టైటిల్ విజయానికి అది అర్హమమైన జట్టే అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే.