2 ల‌క్షల రుణ మాఫీ.. రేవంత్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

హనుమకొండలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ‘వరంగల్ డిక్లరేషన్‌’ ప్రకటించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. చేసే అభివృద్ది పనుల గురించి ప్రసంగించారు. తెలంగాణ అంటే తమకు ఆత్మగౌరవమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న రేవంత్‌… రైతుల కుటుంబాలను కేసీఆర్‌ ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. భూమిలేని కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.12వేలు సాయం చేస్తామని చెప్పారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే… రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వమే కొంటుందని హామీ ఇచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి పసుపు రైతులను ఆదుకుంటామని వెల్లడించారు. పంటల బీమా పథకం అమలు చేసి.. పరిహారం వెంటనే అందజేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ రద్దు చేస్తామని ప్రకటించారు. పోడు రైతులకు పట్టాలు ఇస్తామని తెలిపారు. పెండింగ్‌ ప్రాజెక్టులను అన్నింటిని పూర్తి చేస్తామన్నారు. చట్టపరంగా రైతు కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని వివరించారు.

వరికి ప్రస్తుతం మద్దతు ధర రూ.1960 ఉంది. క్వింటాల్‌ వడ్లను రూ.2500కు చొప్పున కొంటాం. పసుపు పంటను క్వింటాల్‌కు రూ.12 వేలకు కొంటాం. మొక్కజొన్న పంటకు క్వింటాల్‌కు రూ.3500 చెల్లిస్తాం. కాంగ్రెస్‌తోనే రైతు సంక్షేమ రాజ్యం సాధ్యం. వరంగల్‌ డిక్లరేషన్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. అని రేవంత్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ అంటే ఓట్లు రాల్చే ఉన్మాదం కాదని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అంటే ఎన్నికల ముడిసరుకు కాదన్నారు. భూమి లేని రైతులకు ఏడాదికి రూ.12 వేలు సాయం అందిస్తామని తెలిపారు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం అమలు చేస్తామని, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పంటల బీమా అమలుచేసి నష్టపరిహారం వెంటనే అందిస్తామని, రైతు కమిషన్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

“నకిలీ విత్తనాల నియంత్రణ కఠినచట్టం తెస్తాం. వరి కనీస మద్దతు ధర రూ.2,500 ఇస్తాం. పత్తి మద్దతు ధర రూ.6.500 ఇస్తాం. మిర్చి మద్దతు ధర రూ.15 వేలు ఇస్తాం. రైతును రాజును చేయటమే మా లక్ష్యం” అని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.