మ‌హేష్ బాబు మారాడండోయ్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్ ఆరంభంలో సినిమాలు చూస్తే వీర లెవెల్లో డ్యాన్సులు క‌నిపిస్తాయి. రాజ‌కుమారుడు, యువ‌రాజు, వంశీ, మురారి, ఒక్క‌డు లాంటి సినిమాల్లో అత‌ను బాగానే స్టెప్పులు వేశాడు. అప్ప‌ట్లో టాలీవుడ్ టాప్ డ్యాన్స‌ర్ల‌లో ఒక‌డిగా మ‌హేష్‌ను ప‌రిగ‌ణించేవారు. కానీ త‌ర్వాత ఎందుకో మ‌హేష్ డ్యాన్సుల మీద దృష్టిపెట్ట‌డం త‌గ్గించేశాడు. ఏదో నామ‌మాత్రంగా స్టెప్పులేయ‌డ‌మే తప్ప‌.. త‌ర్వాతి త‌రం హీరోలు జూనియ‌ర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్‌ల మాదిరి క‌ష్ట‌ప‌డి స్టెప్పులేసి అభిమానుల‌ను మెప్పించే ప్ర‌య‌త్న‌మే చేయ‌లేదు.

రాను రాను మ‌హేష్ సినిమాలో డ్యాన్సుల ప‌ట్ల పూర్తిగా ఆస‌క్తి కోల్పోయిన‌ట్లు క‌నిపించింది. బ్ర‌హ్మోత్స‌వం లాంటి సినిమాల్లో అత‌ను చేసిన కొన్ని స్టెప్పులు ట్రోల్ మెటీరియ‌ల్‌గా మార‌డం తెలిసిందే. ఐతే ఈ మ‌ధ్య మ‌హేష్‌తో ప‌ని చేస్తున్న ద‌ర్శ‌కులు అత‌డిపై బాగానే ఒత్తిడి తెచ్చి డ్యాన్సుల కోసం క‌ష్ట‌ప‌డేట్లు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

అనిల్ రావిపూడి సినిమా స‌రిలేరు నీకెవ్వ‌రులో మైండ్ బ్లాక్ పాట కోసం చాన్నాళ్ల త‌ర్వాత మ‌హేష్ బాడీ మొత్తం షేక్ చేశాడు. వేరే స్టార్ల‌తో పోల్చ‌లేం కానీ.. మ‌హేష్ గ‌త సినిమాల‌తో పోలిస్తే ఆ మాత్రం స్టెప్పులు వేయ‌డం అభిమానుల‌కు మ‌హ‌దానందాన్ని ఇచ్చింది. ఆ ఊపును ఇప్పుడు ప‌ర‌శురామ్ కూడా కొన‌సాగించాడు. స‌ర్కారు వారి పాట‌లో మ‌హేష్ కోసం మంచి మాస్ పాట పెట్టించాడు. మ‌మ మ‌హేషా అంటూ సాగే పాట కోసం మ‌హేష్‌ను మాస్ అవ‌తారంలోకి మార్చాడు. అలాగే అత‌డితో మంచి మాస్ స్టెప్పులు వేయించాడు.

సరిలేరులో కంటే కూడా మ‌హేష్ ఇందులో స్పీడు పెంచాడ‌ని, మ‌రింత మాస్ ట‌చ్‌తో డ్యాన్సులేశాడ‌ని ఈ పాట ప్రోమోను బట్టి తెలుస్తోంది. ఈ పాట గురించి ప‌ర‌శురామ్, త‌మ‌న్ ఇస్తున్న ఎలివేష‌న్లు చూస్తే రేప్పొద్దున థియేట‌ర్లు హోరెత్తిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ పాట‌లో కీర్తి సురేష్ సైతం మంచి మాస్ స్టెప్పులే వేసిన‌ట్లు ప్రోమోలో తెలుస్తోంది.