క్రాస్ రోడ్స్ లో 5 కోట్లు – వాటే రికార్డ్

కరోనా తర్వాత ఓటిటిల హవా విపరీతంగా పెరిగిపోయి, టికెట్ రేట్లు సామాన్యులకు అందుబాటులో ఉండటం కష్టమైపోయిన పరిస్థితుల్లో ఏదైనా సినిమాకు ఒక థియేటర్ లోనో లేదా సెంటర్ లోనో కోటి రూపాయలు వసూలు చేయడమనేది కలగా మారిపోయింది. కానీ ఇలాంటి టఫ్ సిచువేషన్ లో కూడా తన రేంజ్ ఏంటో చూపించారు ఆర్ఆర్ఆర్ సారథులు రాజమౌళి-జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ లు. హైదరాబాద్ టాలీవుడ్ అడ్డాగా చెప్పుకునే ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో కనివిని ఎరుగని రికార్డు సృష్టించి అబ్బురపరిచారు.

మార్చి 25న విడుదలైన తేదీ నాటి నుంచి ఆ జంక్షన్ లో 5 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మొదటి సినిమాగా ట్రిపులార్ కొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు బాహుబలి 2 పేరు మీద ఉంది. దానికి వచ్చిన మొత్తం 3 కోట్ల 76 లక్షల 26 వేల రూపాయలు. కానీ నిన్న సెకండ్ షో మొదలయ్యే సమయానికే ఆర్ఆర్ఆర్ 5 కోట్లను దాటేసింది. ఇంకా రన్ కొనసాగుతోంది కాబట్టి దీన్నే ఫైనల్ ఫిగర్ గా చెప్పలేం. ఇంత వేసవిలోనూ ఈవెనింగ్ షోలు, వీకెండ్స్ లో ఈ విజువల్ గ్రాండియర్ మంచి వసూళ్లు రాబడుతోంది.

బాహుబలి 2 సమయానికి ఇప్పటికి టికెట్ రేట్లలో వ్యత్యాసం ఉన్నప్పటికీ ఇంత భారీ మొత్తాన్ని వసూలు చేయడం గొప్ప విషయమే. కళ్ళుచెదిరే సౌకర్యాలతో ఎన్నో మల్టీప్లెక్సులు ఉన్నా క్రాస్ రోడ్స్ లో ఉన్న సింగల్ స్క్రీన్ల నుంచే 5 కోట్లు రాబట్టడం అంటే ఆషామాషీ కాదు. అక్కడి సుదర్శన్ 35 ఎంఎంలో వచ్చే వారం అర్ధ శతదినోత్సవం పూర్తి చేసుకోనున్న ఆర్ఆర్ఆర్ సెలెబ్రేషన్స్ కోసం చరణ్ తారక్ ఫాన్స్ రెడీ అవుతున్నారు. తిరిగి ఇంకో ఏడెనిమిది నెలల దాకా ఈ హీరోల సినిమా రాదు కాబట్టి హంగామా మాములుగా ఉండదు.