ఒత్తిడికి తలొంచని జగన్

జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయంలో మార్పుల కోసం ఎంత ఒత్తిడి వచ్చినా జగన్మోహన్ రెడ్డి లొంగలేదు. కడప జిల్లాను రెండుగా విభజించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాకు అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టారు. ఇందులో రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు నియోజకవర్గాలున్నాయి. జిల్లా కేంద్రంగా రాయచోటి నియోజకవర్గాన్ని ప్రభుత్వం ఖాయం చేసింది. ఈ విషయంలోనే రాజంపేట, రాయచోటి, కోడూరు నియోజకవర్గాల్లో పెద్దఎత్తున నిరసనలు జరిగాయి.

జిల్లా కేంద్రాన్ని రాయచోటి కాకుండా రాజంపేట కు మార్చాలని డిమాండ్లు చేశారు. అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందులు, నిరసనలు జరిగాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆందోళనలు, బందులకు వైసీపీ ఎంఎల్ఏలు మేడా మల్లికార్జునరెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు తదితరులు నేతృత్వం వహించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజంపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్ తన పదవికి రాజీనామా కూడా చేశారు.

తమ డిమాండ్ల ప్రకారం ప్రభుత్వం జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుండి రాజంపేటకు మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోతుందని కూడా నానా రచ్చచేశారు. దీని ప్రభావం కడప జిల్లా మీద కూడా పడుతుంది కాబట్టి పార్టీకి తీవ్ర నష్ట తప్పదని నానా గోలచేశారు. స్వయంగా అధికార పార్టీ ఎంఎల్ఏలు, నేతలే అఖిలపక్ష ఆందోళనలను లీడ్ చేసినా జగన్ ఏ మాత్రం పట్టించుకోలేదు.

క్షేత్రస్ధాయిలో జనాల అభిప్రాయాలంటు ఎంఎల్ఏలు జగన్ను కలిసి విజ్ఞప్తులు అందించినా పట్టించుకోలేదు. పైగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంఎల్ఏలు ఒకటికి రెండుసార్లు జగన్ను కలిసినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు. అంటే ఎంఎల్ఏల డిమాండులో హేతుబద్దత లేదని జగన్ అనుకున్నారా ? లేకపోతే ఎంఎల్ఏలు చెప్పింది అబద్ధమని జగన్ అభిప్రాయపడ్డారా ? అన్నదే అర్ధం కావటంలేదు. ఏదేమైనా ప్రతిపక్ష ఎంఎల్ఏల డిమాండ్లనే కాదు సొంత పార్టీ ఎంఎల్ఏల డిమాండ్లకు కూడా జగన్ తలొంచలేదని అర్ధమవుతోంది. మరి దీని పర్యవసానం రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది.