ముంచినా తేల్చినా ప్రభాసే

ఈ ఏడాది ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటైన ‘రాధేశ్యామ్’ ఇంకో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘బాహుబలి’తో ఇండియాలో మరే హీరోకూ లేని, రాని మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్ నటిస్తున్న పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రం ఇది కావడం విశేషం. ప్రభాస్ ఏంటి.. లవ్ స్టోరీ చేయడమేంటి అన్న కామెంట్లు వినిపించాయి ఈ సినిమా పట్టాలెక్కిన మొదట్లో.

కొన్ని నెలల ముందు వరకు అయితే ఈ సినిమాకు పెద్దగా హైప్ కనిపించలేదు. కానీ ఇప్పుడు రిలీజ్ ముంగిట బాగానే బజ్ వచ్చింది. అన్నీ కలిసొస్తున్న టైంలో భారీగా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఐతే ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందన్నది పూర్తిగా ప్రభాస్ మీదే ఆధారపడి ఉందన్నది స్పష్టం. అతడి బాక్సాఫీస్ స్టామినాకు ఈ సినిమా పరీక్షగా నిలవబోతుండటం కూడా వాస్తవం.

పూజా హెగ్డే అన్నట్లు బాహుబలి, సాహో లాంటి భారీ యాక్షన్, హీరోయిజం ప్రధానంగా సాగే చిత్రాల తర్వాత, తన ఇమేజ్ పూర్తిగా మారిపోయిన తరుణంలో ఒక లవ్ స్టోరీ చేయడం ప్రభాస్‌ గట్స్‌కు నిదర్శనం. ప్రభాస్ సైతం తన కెరీర్లో చేసిన అతి పెద్ద రిస్క్ అని చెబుతున్నాడు ‘రాధేశ్యామ్’ గురించి. ఐతే కేవలం ఒక సినిమా, అది కూడా అంతగా ఆడని చిత్రం తీసిన ఓ దర్శకుడితో లవ్ స్టోరీ చేయడం.. దాని మీద నిర్మాతలు రూ.300 కోట్ల బడ్జెట్ పెట్టేంత భరోసా ఇవ్వడం.. ఇప్పుడు రిలీజ్ ముంగిట సినిమాకు ఇంత హైప్ వచ్చేలా చేయడం.. అడ్వాన్స్ ఫుల్స్ పెట్టించడం ప్రభాస్‌కే చెల్లింది.

ఐతే రిలీజ్ ముందు వరకు బాగానే ఉంది. వీకెండ్ వరకు వసూళ్లకు ఢోకా లేదనే అనిపిస్తోంది. కానీ ఈ సినిమాకు ఏమేర లాంగ్ రన్ ఉంటుందన్నది కీలకం. అలాగే ఉత్తరాదిన టాక్‌తో సంబంధం లేకుండా ‘సాహో’ను ఆదరించినట్లు ‘రాధేశ్యామ్’ను చూస్తారా అన్న డౌట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ స్టార్ పవర్ ఏమేర పని చేస్తుందో.. సినిమాను ఎక్కడిదాకా లాక్కెళ్తుందో చూడాలి.