శ్రీనివాస్ గౌడ్ హత్య సుపారీ కేసు.. గులాబీ సర్కారులో గడబిడ?

జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బలం.. తెలంగాణ రాష్ట్రంలోని తమ ప్రభుత్వ తీరు. ఎందుకంటే.. దేశానికి మోడీ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే క్రమంలో.. తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో పరిస్థితుల గురించి గొప్పలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వంకలు పెట్టేందుకు వీలు కాని రీతిలో పరిస్థితులు ఉండాల్సిన అవసరం ఉంది. నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందన్న విషయాన్ని చాటి చెప్పేందుకు ఇటీవల కేంద్రం విడుదల చేసిన ఒక నివేదికను ప్రస్తావించటం తెలిసిందే.

దీన్ని గొప్పగా చెప్పుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియాలో అందరూ తెలంగాణ గురించి మాట్లాడుకునేలా సఫలమయ్యారు. మంచి గురించి ఎలా మాట్లాడుకుంటారో.. ఏదైనా విషయం తేడా వస్తే దాని గురించి కూడా రచ్చ రచ్చగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు సుపారీ ఇచ్చారన్న ఆరోపణలతో ఆరుగురిని అదుపులోకి తీసుకోవటం.. దానికి సంబంధించిన ప్రెస్ మీట్ ను సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది.

తమ భర్తలు కిడ్నాప్ అయ్యారంటూ కొద్ది రోజుల క్రితం వారి భార్యలు మహబూబ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు ఇస్తే.. వారిని వెతికిపెట్టే విషయాన్ని పక్కన పెడితే.. తాజాగా వారిలో కొందరు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయటానికి సుపారీ ఇచ్చారన్న ఆరోపణలతో కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్న వైనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటంతో పాటు.. ఇదో రాజకీయ దుమారంగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. ఈ అరెస్టులకు ముందు.. ఢిల్లీలో ఉన్న వ్యక్తుల్ని ఎవరో కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తడం. ఇలాంటి ఉదంతాల విషయంలో ప్రభుత్వాలు ఆచితూచి అన్నట్లు వ్యవహరించాలి. తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తే పార్టీ నేతల మీద చర్యలు తీసుకునే విషయంలో కేసీఆర్ అనుసరించే వైఖరి.. ఆయన చెప్పే మాటల స్థాయికి తగ్గట్లు ఉన్నాయా? లేదా? అన్న అంశంపై జాతీయ స్థాయి నాయకులు మదింపు చేస్తారన్నది మర్చిపోకూడదు.

ఇలాంటి వేళలో.. తన మంత్రివర్గంలోని ఒక మంత్రి మీద హత్యాయత్నానికి సుపారీ ఇచ్చారని.. అందుకు రూ.15 కోట్ల డీల్ జరిగిందన్న వాదనలపై చాలామంది విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు.. నిందితులుగా పోలీసులు చెబుతున్న వారిలో పలువురు.. ఇప్పటికే శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల సంఘాన్ని మోసం చేసి తప్పు చేశారంటూ సుప్రీంకోర్టులో పోరాడుతున్నవారు. అలాంటి వారి మీద తీవ్రమైన ఆరోపణలు రావటం లాంటివి భిన్నాభిప్రాయాలకు తెర తీయటమే కాదు.. కేసీఆర్ చెప్పే ఆదర్శాలకు.. చేతలకు తేడా ఉందన్న అభిప్రాయం కలిగే అవకాశం ఉందన్నది మర్చిపోకూడదు.