అమరావతి రాజధానిపై హైకోర్టు కీలక తీర్పు

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి అగమ్య గోచరంగా మారిన సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించిన బిల్లును రద్దు చేయడం వంటి పరిణామాలతో ఏపీ రాజధాని అమరావతి అని ఫిక్సయింది. అయితే, మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లుల రద్దు వ్యవహారం తర్వాత కూడా అమరావతిలో డెవలప్ మెంట్ లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

రాజధాని అమరావతి వ్యవహారంలో జగన్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. 3 రాజధానులు, సీఆర్డీఏ బిల్లుల రద్దు పిటిషన్లపై హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలని, ఏపీ రాజధాని ప్లానింగ్‌ను రాబోయే 6 నెలల్లో పూర్తి చేయాలని కీలక తీర్పునిచ్చింది. ముందస్తు ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని, భూములిచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించాలని ఆదేశించింది. ఆ పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

అంతేకాదు, అమరావతి రాజధాని అవసరాలకు తప్ప ఇతర వేరే పనులకు ఆ భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయాలని, రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, లేని అధికారాలతో సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయలేరని గుర్తు చేసింది. అంతేకాదు, అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని, పిటిషనర్లందరికీ ఖర్చుల కింద ప్రభుత్వం రూ.50 వేలు చెల్లించాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ సీఆర్‌డీఏ రద్దు చట్టం, 3 రాజధాను చట్టాలను సవాలుచేస్తూ రాజధాని అమరావతి ప్రాంత రైతులతో పాటు మరికొందరు ఏపీ హైకోర్టును  ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్లపై విచారణ జరుగుతుండగానే జగన్ సర్కార్ కొత్త చట్టం తీసుకొచ్చింది. దీంతో, ఆ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రాజధానిలో ఆగిపోయిన పనులను కొనసాగించాలని తీర్పునిచ్చింది.