విద్య సినిమా.. మళ్లీ ఓటీటీకే!

బాలీవుడ్‌లో ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలకు డిమాండ్ పెంచిన నటి విద్యాబాలన్. కహానీ, డర్టీ పిక్చర్, తుమ్హారీ సులు లాంచి చిత్రాలతో సత్తా చాటింది. హీరోతో పని లేదని, హీరోయిన్‌ కోసం కూడా ప్రేక్షకులు సినిమాలు చూస్తారని ప్రూవ్ చేసింది. బలమైన కథలు, అంతకంటే బలమైన పాత్రలు, అద్భుతమైన పర్‌‌ఫార్మెన్స్‌కి విద్య సినిమాలు కేరాఫ్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.        

ఇప్పుడు మరోసారి అలాంటి స్ట్రాంగ్‌ కాన్సెప్ట్‌తో వస్తోంది విద్య. తనతో ‘తుమ్హారీ సులు’ చిత్రాన్ని తీసిన టీమ్‌తో ‘జల్సా’ అనే సినిమా చేసింది. ఈ చిత్రాన్ని మార్చ్ 18న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయనున్నట్టు టీమ్ ఇవాళ ప్రకటించింది. సురేష్‌ త్రివేణి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, శిఖా శర్మ, సురేష్ త్రివేణి నిర్మించారు. షెఫాలీ షా, మానవ్‌ కౌల్, రోహిణి హట్టంగడి లాంటి వెర్సటైల్ యాక్టర్స్ నటించారు.         

ఇటీవలి కాలంలో విద్య నటించిన సినిమాలన్నీ డిజిటల్ బాటే పడుతున్నాయి. గత రెండు చిత్రాలూ ఓటీటీలోనే విడుదలయ్యాయి. ప్రపంచమే మెచ్చిన మ్యాథమెటీషియన్ శకుంతలా దేవి జీవితం ఆధారంగా తీసిన సినిమా డిజిటల్‌గానే రిలీజయ్యింది. అలాగే విద్య ఫారెస్ట్ ఆఫీసర్‌‌గా నటించిన ‘షేర్నీ’ కూడా ఓటీటీలోనే విడుదలయ్యింది. ఇప్పుడు ఈ చిత్రం కూడా అమెజాన్‌ ప్రైమ్‌లోనే వస్తోంది.        

విద్యకి, ఆమె సినిమాలకి డిమాండ్ ఉండటంతో ఓటీటీలు మంచి రేటు చెల్లించి తన సినిమాలు కొంటున్నాయి. థియేటర్లు, రిలీజుల విషయంలో కన్‌ఫ్యూజన్‌ పూర్తిగా తొలగకపోవడంతో ఆమెతో సినిమాలు తీసినవాళ్లు కూడా ఓటీటీవైపే అడుగులేస్తున్నారు. ఓటీటీల సంగతి, నిర్మాతల సంగతి ఏమోగానీ.. రిలీజైన వెంటనే ఇంట్లోనే కూర్చుని విద్య సినిమాని చూసే చాన్స్‌ దొరుకుతున్నందుకు ప్రేక్షకులైతే హ్యాపీ.