ఉగాదికి కొత్త జిల్లాలు రెడీయా ?

రాబోయే ఉగాది నాటికి కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తి కావాలనే పట్టుదల ఏపీ ప్రభుత్వంలో కనిపిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచుతూ ప్రభుత్వం ఈ మధ్యనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొన్నిచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హిందుపురం, రాజంపేట, ధర్మవరం, విజయవాడ లాంటి చోట్ల జిల్లాల కేంద్రాలను మార్చాలని, పేర్లను మార్చాలనే డిమాండ్లు వినబడుతున్నాయి. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీలోనే అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తీసుకునేందుకు నెల రోజులు గడువిచ్చింది.

అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ప్రస్తుత జిల్లాల కలెక్టర్లు తీసుకుని ఆచరణాత్మకంగా ఉన్న వాటిని పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజా ప్రతినిధులు వస్తే వాళ్ళతో మాట్లాడాలని కూడా చెప్పింది. అలాంటి వాటిపై కసరత్తు చేసి ప్రభుత్వానికి నివేదికను అందించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఇవన్నీ కూడా మార్చి 18వ తేదీలోగానే పూర్తయిపోవాలని డెడ్ లైన్ కూడా విధించింది.

మార్చి రెండోవారంలోగా ప్రక్రియ పూర్తయిపోతే మార్చి 17వ తేదీన మరో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. దీనికి అనుగుణంగానే మార్చి 18వ తేదీన జిల్లాల కలెక్టర్లు గెజెట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీని ఆధారంగా ఏప్రిల్ 2వ తేదీ నుండి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అమల్లోకి వచ్చేస్తుంది. అంటే ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఖాయమని తేలిపోయింది. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలతో పాటు అవసరమైన సిబ్బందిని నియమించేంత వరకు ఇప్పటి కలెక్టర్లు, ఎస్పీలు, సిబ్బందే బాధ్యతలు చూస్తారు.

కొత్తవారిని నియమించిన తర్వాత పాత వారు బాధ్యతల నుండి రిలీవవుతారని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. కొత్తగా ఏర్పడబోయే జిల్లాల్లో భవనాలు, భూములను గుర్తించటంలో ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలు బిజీగా ఉన్నారు. జిల్లాల కలెక్టరేట్లలోని సిబ్బందినే రెండుగా విభజించాలని ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం మీద అభ్యంతరాలున్న చోట్ల ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందనే విషయం ఆసక్తిగా మారింది. ఏదేమైనా కొత్త జిల్లాల ప్రక్రియ మాత్రం స్పీడుగానే జరిగిపోతోంది.