సినిమా వాళ్ల‌కే… సినిమా చూపించిన జ‌గ‌న్‌

గ‌త కొద్దికాలంగా సినిమా టికెట్ల ధ‌ర విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం వ‌ర్సెస్ సినీ ప‌రిశ్ర‌మ అన్న‌ట్లుగా ప‌రిణామాలు మారిపోయాయి. అయితే, దీనికి తాజాగా ఫుల్ స్టాప్ ప‌డ్డ‌ట్లు అయింది. ఈరోజు తాడేపల్లిలో చిరంజీవి బృందంతో సీఎం వైఎస్ జ‌గ‌న్ చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ చ‌ర్చ‌లు, అనంత‌రం ప‌రిణామాల నేప‌థ్యంలో సినిమా వాళ్ల‌కే జ‌గ‌న్ సినిమా చూపించార‌నే టాక్ వ‌స్తోంది. దీనికి కార‌ణం చ‌ర్చ‌ల సంద‌ర్భంగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ వెలిబుచ్చిన అభిప్రాయాలు, సినీ ప‌రిశ్ర‌మ విష‌యంలో వైఎస్ జ‌గ‌న్ ఆలోచ‌న‌లు అని అంటున్నారు.

మిగ‌తా రంగాల వ‌లే నెమ్మదిగా సినీ పరిశ్రమ కూడా విశాఖపట్నం రావాలని సినీ ప్ర‌ముఖుల‌తో సీఎం వైఎస్ జ‌గ‌న్ అభిప్రాయప‌డ్డారు. “అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తా. నెమ్మదిగా ఇక్కడ కూడా దృష్టిపెట్టండి. తెలంగాణాతో పోలిస్తే ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్‌ చేస్తోంది. తెలంగాణా 35 నుంచి 40 శాతం కంట్రిబ్యూట్‌ చేస్తోంది. ఆంధ్రా 60 శాతం వరకు కంట్రిబ్యూట్‌ చేస్తోంది. ఏపీలో జనాభా ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ, ధియేటర్లు కూడా ఎక్కువ. ఆదాయపరంగా కూడా ఏపీ ఎక్కువ. వాతావరణం కూడా బాగుంటుంది. అందరికీ స్ధలాలు ఇస్తాం. స్టూడియోలు పెట్టేందుకు ఆస‌క్తి చూపిస్తే వాళ్లకు కూడా విశాఖలో స్థలాలు ఇస్తాం. జూబ్లీహిల్స్‌ తరహా ప్రాంతాన్ని క్రియేట్‌ చేద్దాం.“ అంటూ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర లెక్క‌లు, విశ్లేష‌ణ‌లు చేశారు. హైదరాబాద్ బెంగళూరు, చెన్నైతో పోటీపడే సత్తా విశాఖకు ఉందన్నారు.

ఇక టికెట్ల ధ‌ర గురించి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందిస్తూ, ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకటే రేటు, దీని కోసం కార్యాచరణ చేసుకోవాలని సినీ ప్రముఖులకు సూచించారు. ‘ఇప్పటివరకు కొద్దిమందికి ఎక్కువ, కొద్దిమందికి తక్కువ టికెట్ రేట్లు వసూలు చేస్తున్నారు. చిరంజీవి అన్న, నేను దీనిపై విస్తృతంగా చర్చించాం’ అని జగన్‌ వివరించారు. భారీ బడ్జెట్ సినిమాలకు ప్రోత్సహకాలు అందించే ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు. ఇటు సినీ ప్రేక్ష‌కుల కోసం , అటు సినీ ప‌రిశ్ర‌మ కోసం వైఎస్ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు సినీ ప‌రిశ్ర‌మ వారికే సినిమా చూపించిన‌ట్లుంద‌ని ప‌లువురు అంటున్నారు.