అఖిల్ ప్యాన్ ఇండియా ప్లాన్స్

ప్యాన్ ఇండియా.. ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్ అందరి బుర్రలో ఇదే తిరుగుతోంది. ప్రభాస్‌తో మొదలైన ఈ ప్యాన్ ఇండియా మేనియా అల్లు అర్జున్ ‘పుష్ప’తో పీక్స్‌కి వెళ్లిపోయింది. దాంతో  అందరూ తమ సినిమాని ఆ స్థాయిలోనే తీయాలనే ఆరాటంలో ఉన్నారు. ఇప్పుడు అఖిల్ సినిమా విషయంలోనూ అలాంటి ప్రణాళికలే నడుస్తున్నాయి.     

సురేందర్‌‌ రెడ్డి డైరెక్షన్‌లో అఖిల్ హీరోగా ‘ఏజెంట్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం కండలు పెంచి కంప్లీట్‌గా మేకోవర్ కూడా అయ్యాడు అఖిల్. అతని కష్టం చూస్తుంటేనే ఈ చిత్రాన్ని ఓ హై ఓల్టేజ్‌ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా మలుస్తున్నారనే విషయం అర్థమవుతోంది. అయితే టేకింగ్‌ విషయంలోనే కాదు.. రిలీజ్ విషయంలోనూ సురేందర్‌‌ రెడ్డి, నిర్మాత అనిల్ సుంకర భారీ ప్లాన్‌తో ఉన్నారట.       

ఏజెంట్ సినిమాని తెలుగులోనే తీసినా.. పలు భారతీయ భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నారట. కచ్చితంగా ప్యాన్ ఇండియా లెవెల్‌లోనే ఈ సినిమా ఉంటుందని రీసెంట్‌గా సురేందర్‌‌ రెడ్డి భార్య దీప తన ఇన్‌స్టా చాట్‌లో రివీల్ చేశారు. నెటిజన్స్‌తో చాట్ చేస్తున్నప్పుడు ఆమెని కొందరు ఈ సినిమా గురించి గుచ్చి గుచ్చి అడిగారు. ఆప్పుడే ఆమె ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేశారు.        

అంతే కాదు.. ఏజెంట్ మూవీ అంచనాల్ని మించి ఉంటుందని.. అఖిల్ చాలా డెడికేటెడ్ యాక్టర్ అని, హార్డ్ వర్క్ చేస్తాడని చెప్పారు. ఈ నెల 15 తర్వాత షూట్ రీస్టార్ట్ కాబోతోందని కూడా కన్‌ఫర్మ్ చేశారామె. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ కొంత పార్ట్‌ని బుడాపెస్ట్‌లో తీశారు. తర్వాత కరోనా కారణంగా బ్రేక్ పడింది. మలయాళ స్టార్‌‌ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటించడం, తమన్ సంగీతం అందించడంతో అంచనాలు పెరిగాయి. ఇప్పుడీ ప్యాన్ ఇండియా సంగతులతో అవి మరింత పెరిగిపోతాయి.