సత్యరాజ్ పరిస్థితి కాస్త కష్టంగానే..

కరోనా మహమ్మారి గత ెండేళ్లలో ఎంత మంది ప్రముఖులను పొట్టనబెట్టుకుందో తెలిసిందే. ఆరోగ్యంగా కనిపించి, హుషారుగా ఉన్న వాళ్లు చాలామంది కరోనా సోకి అర్ధంతరంగా తనువు చాలించారు. కొందరు మృత్యువుకు చేరువగా వెళ్లి త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవ్వరూ కూడా కరోనాను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ప్రముఖులెవరైనా వైరస్‌తో ఆసుపత్రి పాలయ్యారంటే అభిమానుల్లో దడ పుడుతోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌తో పోలిస్తే థర్డ్ వేవ్ కాస్త నయం అనే అంటున్నారు.

కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగిపోతున్నాయి కానీ.. వైరస్ తీవ్రత ఆ స్థాయిలో లేదని, విషమంగా ఉన్న కేసులు తక్కువే అని అంటున్నారు. అయినా సరే.. లోలోన భయం మాత్రం కొనసాగుతోంది. మహేష్ బాబు సహా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ఎందరో ప్రముఖులు ఈ పర్యాయం కరోనా బాధితులుగా మారారు.ఐతే వయసు మీద పడ్డ వాళ్లు కరోనా బారిన పడితేనే కంగారు ఎక్కువగా ఉంటోంది.

తాజాగా తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ కరోనాతో ఆసుపత్రి పాలయ్యారు. కరోనా సోకాక ముందు ఆయన ఇంట్లోనే ఐసొలేట్ అయ్యి వైద్యుల పర్యవేక్షణలో సాగారు. కానీ రెండు రోజుల ముందు ఆయనకు కరోనా లక్షణాలు తీవ్రం అయ్యాయి. దీంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉందట. కరోనా లక్షణాలు కొంచెం తీవ్రంగానే ఉండగా.. వైరస్ దాని ప్రభావంతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయట.

దీంతో ఐసీయూలో సత్యరాజ్ కోసం ఒక స్పెషల్ మెడికల్ టీంను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. సత్యరాజ్ కుటుంబ సభ్యులు కొంచెం ఆందోళనలోనే ఉన్నారు. అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. ఐతే సత్యరాజ్‌కు ప్రాణాపాయం అయితే లేదని, కోలుకోవడానికి కొంచెం సమయం పట్టొచ్చని, ఆయన ఆసుపత్రి నుంచి బయటికి వస్తారని సన్నిహితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మిర్చి, నేను శైలజ, బాహుబలి తదితర చిత్రాలతో గత కొన్నేళ్లలో తెలుగులో సత్యరాజ్ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.