మ‌ణిర‌త్నంతో సుకుమార్‌ చేదు అనుభ‌వం

ఇప్పుడు టాలీవుడ్ అనే కాదు.. ఇండియాలోనే టాప్ డైరెక్ట‌ర్ల‌లో సుకుమార్ ఒక‌డు. రంగ‌స్థ‌లం సినిమాతోనే వేరే ఇండ‌స్ట్రీ వాళ్లు సైతం సుక్కు వైపు చూశారు. ఇప్పుడు పుష్ప మూవీతో అన్ని భాష‌ల్లో, ఇండ‌స్ట్రీలో సుకుమార్ హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పుడు ఇంత పాపులారిటీ సంపాదించిన సుకుమార్‌కు ద‌ర్శ‌కుడు కావ‌డానికి స్ఫూర్తినిచ్చింది మ‌ణిర‌త్నం అట‌.

యుక్త వ‌య‌సులో గీతాంజ‌లి సినిమా చూసి తాను ఫిదా అయిపోయాన‌ని.. ఆ సినిమాను తాను చూసింది నాన్ ఏసీ థియేట‌ర్లో అయిన‌ప్ప‌టికీ.. తెలియ‌ని ఒక చ‌ల్ల‌ద‌నాన్ని ఫీల‌య్యాన‌ని, సినిమా చూసి బ‌య‌టికి వ‌స్తుంటే గ‌ర్ల్ ఫ్రెండ్‌ను విడిచిపెట్టి వ‌చ్చేసిన‌ట్లు అనిపించింద‌ని.. ఒక ద‌ర్శ‌కుడు సినిమా తీస్తే ఇంత‌గా జ‌నాల‌ను ప్ర‌భావితం చేయ‌వ‌చ్చా అనిపించి అప్పుడే ద‌ర్శ‌కుడు కావాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చాన‌ని సుక్కు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఆపై త‌న‌కెంతో ఇష్ట‌మైన న‌వలా ర‌చ‌యిత యండ‌మూరి వీరేంద్ర నాథ్ సైతం ద‌ర్శ‌కుడిగా మార‌డంతో డైరెక్ష‌న్‌కు ఉన్న ప‌వ‌రేంటో మ‌రింత‌గా అర్థ‌మై ఇంకా బ‌లంగా ద‌ర్శ‌కుడు కావాల‌ని డిసైడైన‌ట్లు తెలిపాడు. ఐతే తాను ద‌ర్శ‌కుడు కావడానికి స్ఫూర్తినిచ్చిన మ‌ణిర‌త్నంతో త‌న‌కో చేదు అనుభ‌వం ఉన్న‌ట్లు సుకుమార్ వెల్ల‌డించాడు. తాను ద‌ర్శ‌కుడు కావ‌డానికి ముందు మ‌ణిర‌త్నంను క‌ల‌వ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేద‌ని.. ఐతే ఆర్య సినిమాతో తాను ద‌ర్శ‌కుడిగా మారాక.. మ‌ణిర‌త్నం గురు చేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న ముంబ‌యిలోని ఒక హోట‌ల్లో క‌నిపించార‌ని.. అప్పుడాయ‌న న‌టి శోభ‌న‌తో సీరియ‌స్‌గా ఏదో మాట్లాడుతూ క‌నిపించార‌ని.. తెలిపారు.

ఇక వాళ్ల సంభాష‌ణ ముగిశాక ఆయ‌న్ని క‌లుద్దామ‌ని అక్క‌డే కాసేపు వెయిట్ చేశాన‌ని.. ఎంత‌కీ అది ముగియ‌క‌పోవ‌డంతో సార్ అని ప‌ల‌క‌రించ‌బోయాన‌ని.. ఆయ‌న కోపంగా వెళ్లు అన్న‌ట్లు చేత్తో సంజ్ఞ చేశార‌ని.. దీంతో తాను కొంచెం హ‌ర్ట‌య్యాన‌ని సుకుమార్ తెలిపాడు. కానీ ఒక ద‌ర్శ‌కుడిగా సీరియ‌స్ డిస్క‌ష‌న్లో ఉన్న‌పుడు ఎవ‌రైనా డిస్ట‌ర్బ్ చేస్తే ఎలా ఉంటుందో త‌న‌కు త‌ర్వాత అర్థ‌మైంద‌ని.. అదేమీ త‌ప్పుగా అనిపించ‌లేద‌ని.. ఎప్ప‌టికైనా మ‌ణిర‌త్నంను క‌ల‌వాల‌న్న‌ది త‌న కోరిక అని.. ఐతే ఇప్ప‌టికీ అది తీర‌లేద‌ని, కానీ ఆయ‌న్ని త‌ప్ప‌క క‌లుస్తాన‌ని చెప్పాడు సుకుమార్.