‘పుష్ప’ టిక్కెట్టు.. ప్లస్సా మైనస్సా?

పెద్ద హీరోలు నటించిన భారీ సినిమాలు రిలీజైనపుడు తెలుగు రాష్ట్రాల్లో తొలి వారం టికెట్ల రేట్లు పెంచుకోవడం, అదనపు షోలు వేసుకోవడం కొన్నేళ్లుగా నడుస్తున్న సంప్రదాయమే. ఐతే ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య అందుకు అవకాశం ఉండట్లేదు. ఉన్న రేట్లు కూడా కొనసాగించకుండా చాలా ఏళ్ల కిందటి ధరల్ని అమలు చేస్తుండటంతో నిర్మాతలు బాగా ఇబ్బంది పడుతున్నారు.

ఐతే తెలంగాణలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ రేట్టను మునుపటి కంటే ఎక్కువ స్థాయిలో పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చేశారు. గతంలో మల్టీప్లెక్సుల్లో రూ.150 ఉన్న స్క్రీన్లలో ధరల్ని రూ.200కు పెంచి అమ్మేవారు. రూ.200 ఉంటే రూ.250 చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ‘పుష్ప’ సినిమాకు ఒకేసారి 150 నుంచి 250కి రేట్లు పెంచేశారు. సింగిల్ స్క్రీన్లలో రూ.120 ఉన్న టికెట్ రూ.200కు చేరుకుంది. మరీ ఈ స్థాయిలో రేట్లను పెంచేయడం పట్ల ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

‘పుష్ప’ సినిమాపై భారీ అంచనాలున్న మాట వాస్తవం. టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. దీన్ని చూసుకుని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మరీ అత్యాశకు పోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో రేట్లు తక్కువ ఉండటం వల్ల పడుతున్న గండిని ఇక్కడ పూడ్చుకుంటున్నట్లుగా ఉందని.. ఇది చూసి ఏపీలో టికెట్ల ధరలపై నియంత్రణ తేవడంలో తప్పేమీ లేదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. అసలు ఈ స్థాయిలో ధరలు పెంచడం ‘పుష్ప’కు ప్లస్సా మైనస్సా అన్నది కూడా చూడాలి.

ఈ ధరలు చూసి కొంత మేర ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి వెనుకంజ వేస్తారు. సినిమాకు మంచి టాక్ వస్తే ఓకే కానీ.. డివైడ్ టాక్ వస్తే మాత్రం ఈ ధరలు ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తాయి. ఓటీటీల్లో వచ్చాక చూసుకుందాం.. రెండో వారం వరకు వేచి చూద్దాం అనుకుంటారు. కానీ ఆలోపు పైరసీ వెర్షన్లు వచ్చేస్తుంటాయి. థియేటర్లలోకి కొత్త సినిమాలు దిగుతాయి. ఇలా ధరలు పెంచడం వల్ల దెబ్బ తిన్న సినిమాలు కూడా లేకపోలేదు. మరి ‘పుష్ప’ మీద ఈ టికెట్ల రేట్ల పెంపు ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.