పుష్ప క‌థేంటో ర‌ష్మిక‌కు తెలియ‌ద‌ట‌

ఒక సినిమాకు పని చేస్తున్న యూనిట్లో అందరికీ ఆ సినిమా కథేంటో తెలియాల్సిన అవసరం లేదు. కానీ మెయిన్ కాస్ట్ అండ్ క్రూకు కథ మీద అవగాహన ఉండాల్సిందే. ముఖ్యంగా హీరో హీరోయిన్లకు పూర్తి కథ.. అలాగే తమ పాత్రలపై పూర్తి అవగాహన ఉంటే సినిమాలో మరింతగా ఇన్వాల్వ్ కావడానికి, ఇంకా బాగా పెర్ఫామ్ చేయడానికి అవకాశముంటుంది. ఐతే ‘పుష్ప’ సినిమాలో కథానాయికగా నటించిన రష్మిక మందన్నకు ఈ చిత్ర కథేంటో తెలియదట.

ఈ విషయాన్ని ‘పుష్ప’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసినపుడు స్వయంగా ఆమే వెల్లడించింది. ‘పుష్ప’ కథ విన్నపుడు మీకేమనిపించింది అని రష్మికను అడిగితే.. ‘‘సుకుమార్ సర్ నాకెప్పుడూ పూర్తి కథ చెప్పలేదు. నాకే కాదు.. యూనిట్లో చాలామందికి ఆయన కథ చెప్పలేదు. కానీ సుకుమార్ సార్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. ఆయన్ని నమ్మి ముందుకెళ్లిపోయా.

డబ్బింగ్ టైంలో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు చూశా. ఇలాంటి సినిమాలో నటించినందుకు చాలా గర్వంగా ఉంది’’ అని రష్మిక చెప్పింది. ఇక ‘పుష్ప’ పార్ట్‌-1లో తన పాత్ర టీజర్ లాగా ఉంటుందని.. తొలి భాగంతో పోలిస్తే సెకండ్ పార్ట్‌లో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం, నిడివి ఉంటాయని రష్మిక వెల్లడించింది. తనకు ‘పుష్ప’ కథేంటో తెలియదన్న రష్మిక మాటలకు మరీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

బేసిగ్గా సుకుమార్.. హీరో, కెమెరామన్‌కు మినహాయిస్తే కథ చెప్పరని.. స్టోరీ లీక్ అయిపోతుందన్న భయం దీనికో కారణం అయితే.. ఆయన స్క్రిప్టును ఎప్పుడూ లాక్ చేయరని, మేకింగ్ టైంలో కూడా మార్పులు చేర్పులు జరగడం వల్ల కథ ఇది అని ఎవరికీ చెప్పరని.. ఆయనతో పని చేసే రైటర్లకు కూడా కథ మీద క్లారిటీ ఉండదని సన్నిహితులు అంటుంటారు. ‘పుష్ప’ విషయంలోనూ ఆయన అదే ఒరవడిని కొనసాగించినట్లున్నారు.