మెడ‌పై క‌త్తిపెట్టి రాయించుకున్నారు. కేసీఆర్ సంచ‌ల‌న కామెంట్లు

కేంద్ర ప్ర‌భుత్వంపై మ‌రోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. వ‌రి-వార్ కొన‌సాగింపులో ఆయ‌న మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా రాష్ట్ర కేబినెట్ మీటింగ్ నిర్వ‌హించిన కేసీఆర్.. వ‌రి సేక‌ర‌ణ‌, కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానం. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన ధ‌ర్నాలు, దీక్ష‌లు.. కేంద్రంపై కొట్లాట వ్యాఖ్య‌లు.. ఇలా.. అన్ని అంశాల‌పైనా.. సుదీర్ఘంగా చ‌ర్చించారు. అనంత‌రం.. కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వ‌రి ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో కేంద్రం అనుస‌రిస్తున్న తీరును.. కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. మీడియాతో కేసీఆర్ ఏమ‌న్నారంటే..

కేంద్రం.. చిల్ల‌ర కొట్టు య‌జ‌మాని!

బాయిల్డ్ రైస్ తీసుకోబోమ‌ని చెప్పేస్తున్నారు. యాసంగిలో తీసుకునేది లేద‌న్నారు. రా రైస్ ఎంత తీసుకుంటారో చెప్ప‌లేదు. మెడ‌ల‌పై క‌త్తిపెట్టి లేఖ రాయించుకున్నారు. కేంద్రం త‌న సామాజిక బాధ్య‌త‌ను విస్మ‌రించింది. నీటి తీరువా వ‌సూలు చేయ‌ని ఏకైక రాష్ట్రం తెలంగాణ‌. కేంద్ర ప్ర‌భుత్వం కొట్ల మంది ప్ర‌యోజనాలు కాపాడాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, చిల్ల‌ర కొట్టు య‌జ‌మానిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అన్నీ డొంక తిరుగుడు మాట‌లే చెబుతోంది. రాజ్యాంగ‌బ‌ద్ధంగా ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టాన్ని అమ‌లు చేయాల్సిన బాద్య‌త కేంద్రంపైనే ఉంది. ఇంత దిగ‌జారిన కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఎప్పుడూ చూడ‌లేదు. అన్నీ అబ‌ద్దాలే చెబుతున్నారు. మేం ఏంమట్లాడినా.. త‌ప్పుబ‌డుతున్నారు. అని కేసీఆర్ విరుచుకుప‌డ్డారు.

మెడ‌పై క‌త్తిపెట్టి..

వ‌రి సేక‌ర‌ణ‌లో ల‌క్ష కోట్ల రూపాయ‌ల న‌ష్టం వ‌చ్చినా కేంద్రం భ‌రించాలి. త‌న బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకొని రాష్ట్రాల‌పై నింద‌లు మోపుతున్నారు. రైతులు బాగా పండించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం కోరుకుంటోంది. ఇంత నీచ‌మైన రాజ‌కీయాలు చేసే కేంద్ర ప్ర‌భుత్వం ఇదే చూస్తున్నాం. ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే విష‌యంపై కేబినెట్‌లో నాలుగు గంట‌లు చ‌ర్చించాం. బాయిల్డ్ రైస్ విష‌యంలో కేంద్రం లేఖ రాయించుకుంది. అయితే.. ఇది రాష్ట్రాల మెడ‌ల‌పై క‌త్తి పెట్టి రాయించుకున్న‌దే త‌ప్ప‌.. రాష్ట్రాలు ఇష్ట‌పూర్వ‌కంగా రాసింది కాదు. తెలంగాణలో వ‌చ్చేది అంతా కూడా బాయిల్డ్ రైసే. మ‌రిదీనిని ఎవ‌రు తీసుకుంటారు. పోనీ.. రాబియ్యం సేక‌ర‌ణ‌పైనా కేంద్రం ఏమీ చెప్ప‌డం లేదు.

టార్గెట్ కిష‌న్ రెడ్డి..

కేంద్రంలో మంత్రిగా ఉన్న కిష‌న్‌రెడ్డి.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ప‌ట్టించుకోవ‌డం లేదు. రాష్ట్రానికి జ‌రుగుతున్న అన్యాయంపై ఆయ‌న సిపాయి మాదిరిగా పోరాడాలి. కానీ.. కిష‌న్ రెడ్డి ద‌ద్ద‌మ్మ‌లా మాట్లాడుతున్నారు. ఉన్మాదిలా మాపై దాడి చేస్తున్నారు. కిష‌న్ రెడ్డికి ద‌మ్ముంటే.. ఆయ‌న బాయిల్డ్ రైస్ కొనేలా చేయాలి. మేం రైతు బంధువులం.. బీజేపీ నేత‌లు రైతు రాబందులు. 90 ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యాన్ని కొనాల‌ని రాష్ట్ర త‌ర‌ఫున కేంద్రాన్ని కోరాం. యాసంగిలో వ‌రి సాగు చేస్తే.. నూక ఎక్కువ‌గా వ‌స్తుంది. అందుకే రైస్ మిల్ల‌ర్లు.. దానిని బాయిల్డ్ రైస్‌గా మారుస్తారు. కేంద్రం నిజంగా రైతు ప‌క్ష‌పాతి ప్ర‌భుత్వ‌మే అయితే.. ధాన్యం సేక‌రించేలా కిష‌న్ రెడ్డి సూచించాలి. అవ‌స‌ర‌మైతే.. పోరాటం చేయాలి. లేక‌పోతే.. తెలంగాణ రైతు ఆత్మ‌హ‌త్య‌లు మ‌ళ్లీ పెరుగుతాయి. దీనికి ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తారు? అని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు.