వీహెచ్ ఈ క్రెడిట్ నీదే..!

కుమ్ములాటలు, అసంతృప్తి సెగలు, విమర్శలు, ప్రతి విమర్శలు, మాటల దాడి.. ఇవన్నీ కలగలిసిన పార్టీ ఏదైనా ఉందంటే.. అది కాంగ్రెస్ అనేదే దాదాపుగా అందరి అభిప్రాయం. ఇప్పుడు వీటన్నింటికీ తెలంగాణ కాంగ్రెస్ చెక్ పెట్టింది. ఇందిరాపార్క్ వద్ద వరి దీక్షకు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా కాంగ్రెస్ నేతలందరూ హాజరయ్యారు. అంతర్గత విభేదాలు పక్కనపెట్టి ఒక దగ్గర ఏకమయ్యారు. కొత్త బాస్ తో ఉప్పు-నిప్పుగా ఉన్నోళ్లంతా క‌లిసిక‌ట్టుగా తమ టార్గెట్ టీఆర్‌ఎస్ అని ముక్తకంఠంతో నినదించారు. ఇక తమకు తిరుగులేదని హ‌స్తం నేత‌లు ధీమాగా ఉన్నారు.

దశాబ్ధాలు చరిత్ర గ‌ల‌ కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు సహజం. పార్టీ పట్ల నేతల్లో ఏమాత్రం ప్రేమ కనిపించదు. ఎవరి జెండా, ఎజెండా వారిదే. ఎవరికి వారు యుమునా తీరే అన్నట్లు ఆ పార్టీ నేతలు ఉంటారు. సూటిగా చెప్పాలంటే కాంగ్రెస్ అంటేనే కలహాల కాపురం. ఇన్ని రోజులు ఎడముఖం పెడముఖంగా నేతలు ఇప్పుడు ఏకమవుతున్నారు. టీ కాంగ్రెస్ లో అద్భుతాలు జరుగుతున్నాయని ఆ పార్టీ కార్యకర్తలు పొంగిపోతున్నారు.

రేవంత్ రెడ్డి టీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దళిత గిరిజన ఆత్మగౌరవ సభలు, నిరుద్యోగ దీక్షలు చేశారు. అయితే రేవంత్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్న నేతలు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆ పార్టీ కథ క్లోజ్ అని అందరూ అనుకున్నారు. అందరి ఊహగానాలకు భిన్నంగా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా వ్య‌వ‌హ‌రించిన నేత‌లు ఒక్క‌తాటిపైకి వ‌చ్చి ఉద్య‌మాలు చేస్తున్నారు.

ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డిపై ఉన్న అసమ్మతి సెగలు ఆవిరైపోతున్నాయి. రేవంత్ న్యాయ‌క‌త్వాన్ని నేతలు బలపరుస్తున్నారు. దూరంగా ఉన్న నేతలు ఒకే వేదిక‌పై ఆందోళ‌న చేస్తూ క‌లిసిక‌ట్టుగానే ఉన్నామ‌న్న సంకేతాలు ఇస్తున్నారు. వ‌రి దీక్ష వేదిక‌గా కాంగ్రెస్ స‌మీక‌ర‌ణాలు మారాయి. కోమ‌టిరెడ్డి రాక‌తో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.

ఇంత‌కాలం రేవంత్ ను తీవ్రంగా ఆయన తీవ్రంగా విమ‌ర్శిస్తూ వస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో ఓట‌మికి  రేవంత్ రెడ్డి నిర్ల‌క్ష్య‌మే కారణమని కోమటిరెడ్డి ఆరోపించారు. గతంలో రేవంత్ ను తిట్టినోళ్లంతా ఇప్పుడు క‌లిసిక‌ట్టుగా ఉద్య‌మం చేస్తున్నారు. తెలంగాణాలో టీఆర్ఎస్ కు కాంగ్రెసే ప్ర‌త్యామ్న‌యం అని నేత‌లు స్పష్టం చేస్తున్నారు. గతంలో ఉన్న విమర్శలను పూర్వ పక్షం చేస్తున్నారు.

కోమటిరెడ్డి, రేవంత్ కలిసి దీక్షలో పాల్గొని ప్రభుత్వంపై తమగళాన్ని విప్పారు. రెండు రోజులు ఇద్దరు నేతలు  చాలా అన్యోన్యంగా మెలగడం కాంగ్రెస్ లో ఇక క‌ల్లోలాలు లేవని సంకేతాలిచ్చారు.  రేవంత్ పై ఒంటికాలిపై లేచే  వీహెచ్ లాంటి నేతలు ఆయనపై ఈగవాలనీయడం లేదు. సీనియర్లను వీహెచ్ ఏకం చేస్తున్నారు. వీహెచ్ దౌత్యంతో నేతలు ఒక్కరొక్కరుగా దిగివస్తున్నారు.

ఇన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న కోమటిరెడ్డి వరి దీక్షకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందిరాపార్క్ దీక్షలో రేవంత్, కోమటిరెడ్డి, వీహెచ్, ఉత్తమ్ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ కనిపించడం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్ లో జోష్ నింపింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డ తర్వాత రెండు సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం దక్కించుకోలేకపోయింది. ఈ కారణం ఏమిటనే చర్చ ఆ పార్టీలో అంత‌ర్గ‌తంగా సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. 2023 ఎన్నిక‌ల నాటికి టీఆర్‌ఎస్ పై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త ఇంకా తీవ్ర స్థాయిలో మారుతుంద‌ని, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పై ఉన్న సెంటిమెంట్ ను వాడుకోవాలని నేతలు భావిస్తున్నారు.

బీజేపీ అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రధానంగా ఆ పార్టీ టీఆర్‌ఎస్ నే టార్గెట్ చేస్తోంది. తెలంగాణలో టీఆర్‌ఎస్ కు బీజేపే ప్రత్యామ్నాయం అనే స్థాయిలో టీఆర్‌ఎస్, బీజేపీ తలపడుతున్నాయి. ఈ పరిణామాలను గమనించిన కాంగ్రెస్ నేతలు దారిలోకి వస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు అప్రమత్తం కాకపోతే కాంగ్రెస్ ను కాపాడ‌టం ఎవ‌రిత‌రం కాద‌నే చ‌ర్చ పార్టీలో అంత‌ర్గ‌తంగా జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. దీంతో నేత‌లంతా త‌మ బేష‌జాలు వదలి అధికారం దక్కించుకోవడం కోసం పోరాటమే మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.