తమన్‌ను బాధ పెట్టిన పాట

Thaman

ఇప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా తమన్ పేరు చెప్పేయొచ్చు. అతను చేస్తున్న సినిమాల స్థాయి, తన మ్యూజిక్ క్వాలిటీ, అలాగే తన ఆల్బమ్‌లు సాధిస్తున్న విజయాల ప్రకారం చూస్తే తమన్ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. కొన్నేళ్ల ముందు రొటీన్ మ్యూజిక్‌తో విమర్శలు ఎదుర్కొన్న తమన్.. ఆ తర్వాత తనను తాను రీఇన్వెంట్ చేసుకుని ప్రతి సినిమాకూ భిన్నమైన మ్యూజిక్ ఇస్తూ.. అదిరిపోయే పాటలు, నేపథ్య సంగీతంతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

గత కొన్నేళ్లలో తమన్ చేసిన సినిమాల్లో సంగీతం పరంగా చాలా కొత్తగా అనిపించి.. ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన తెచ్చుకున్న చిత్రాల్లో ‘అరవింద సమేత’ ఒకటి. ఇందులో అనగనగనగా.. పెనివిటి లాంటి పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో తెలిసిందే. నేపథ్య సంగీతం పరంగా కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.

ఐతే ఈ సినిమాలో తాను ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన పాటకు అనుకున్నంత పేరు రాకపోవడం బాధ పెట్టిందని తమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మీరు బాగా చేసి కూడా ప్రేక్షకులు ఆదరించని పాట ఏదైనా ఉందా అని ఈ ఇంటర్వ్యూలో తమన్‌ను అడిగితే.. ‘‘అరవింద సమేత సినిమాలో యాడబోయినాడో పాటను నేను చాలా స్పెషల్‌గా భావిస్తాను. ఈ పాట చాలా కష్టపడి చేశాను. అది అంత సులభంగా చేసే పాట కాదు.

ఆ మూడ్‌లోకి వెళ్లడానికే చాలా టైం పట్టింది. నేను నా కుటుంబంలో జరిగిన బాధాకర సంఘటనలను గుర్తు చేసుకుని ఒక మూడ్‌లోకి వెళ్లి చేసిన పాట అది. దాన్ని పాడటం కూడా అంత తేలిక కాదు. నిఖిత అని వైజాగ్‌కు చెందిన సింగర్‌ను పిలిపించాం. ఆమె అద్భుతంగా ఆ పాట పాడింది. రిలీజయ్యాక ఈ పాటకు గొప్ప స్పందన వస్తుందని అనుకున్నాం. కానీ పెనివిటి, రెడ్డి ఇటు సూడు లాంటి పాటలే చాలా పెద్ద హిట్టయ్యాయి. దీనికి అనుకున్నంత స్పందన రాకపోవడం నిరాశపరిచింది’’ అని తమన్ చెప్పాడు.