చిరు ప‌ట్ల అభిమానుల అసంతృప్తి

మెగాస్టార్ చిరంజీవి వెండితెర ద‌ర్శ‌నం కోసం అభిమానులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. సైరా త‌ర్వాత చిరంజీవి సినిమా రిలీజై రెండేళ్లు దాటిపోయింది. ఆచార్య గ‌త ఏడాదే విడుద‌ల కావాల్సింది కానీ.. క‌రోనా పుణ్య‌మా అని వాయిదాల మీద వాయిదాలు ప‌డి ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు.

ద‌స‌రా అన్నారు.. దీపావ‌ళి.. క్రిస్మ‌స్.. సంక్రాంతి అని ఊరించి ఊరించి చివ‌రికి తీసుకెళ్లి ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 4కు షెడ్యూల్ చేశారు. ఐతే ఈ డేట్ విష‌యంలో ముందు నుంచి అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. తాజాగా సినిమాలో రామ్ చ‌ర‌ణ్ చేసిన సిద్ధ పాత్ర‌కు సంబంధించిన టీజ‌ర్ చూశాక అభిమానుల అసంతృప్తి ఇంకా పెరిగిపోతోంది. చివ‌ర్లో పులి, దాని పిల్ల‌ను చూపించి.. ఆ త‌ర్వాత చిరు, చ‌ర‌ణ్‌ల‌ను చూశాక వారి ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు.

సినిమా మీద ఉన్న అంచ‌నాల‌ను మరింత పెంచేలా, మెగా అభిమానుల‌కు పూన‌కాలు తెప్పించేలా ఉందా షాట్. థియేట‌ర్ల‌లో క‌చ్చితంగా ఒక సెల‌బ్రేష‌న్ తీసుకొచ్చే మూవీలా క‌నిపిస్తోంది ఆచార్య‌. ఐతే ఇలాంటి సినిమాను అన్ సీజ‌న్ అయిన ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయ‌డ‌మే అభిమానుల‌కు న‌చ్చ‌ట్లేదు. సంక్రాంతి కుద‌ర‌క‌పోతే వేస‌వికి వెళ్లాల్సింది. లేదా క్రిస్మ‌స్ బ‌రిలో సినిమాను నిలపాల్సింది. ఆచార్య షూటింగ్ ఎప్పుడో అయిపోయింద‌న్నారు.

నెల‌ల త‌ర‌బ‌డి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ చేయ‌డానికి ఇదేమీ బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్, సైరా టైపు సినిమా కాదు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఆ ప‌ని కానిచ్చి పుష్ప వ‌చ్చిన వారం త‌ర్వాత క్రిస్మ‌స్ రేసులో నిలిపితే సంక్రాంతి వ‌ర‌కు ఆచార్య సంద‌డి చేసేదేమో. సంక్రాంతికి ఖాళీ లేద‌నుకుంటే.. స‌మ్మ‌ర్ సీజ‌న్ ఆరంభంలో, అంటే మార్చి ద్వితీయార్ధంలో సినిమాను విడుద‌ల చేయాల్సిందేమో. ఎటూ కాకుండా యూత్ అంతా చ‌దువుల్లో బిజీగా ఉండే టైంలో, అన్ సీజ‌న్లో సినిమాను రిలీజ్ చేయ‌డ‌మేంట‌నే అసంతృప్తి అభిమానుల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.