రేవంత్ న‌యా ప్లాన్‌తో టీ కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం..!

తెలంగాణ కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం మొద‌లైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి త్వ‌ర‌లో డీసీసీ అధ్య‌క్షుల‌ను మార్చ‌నున్నార‌ని.. ప‌నిచేసే వారికే ప‌ట్టం క‌ట్ట‌నున్నార‌ని గాంధీభ‌వ‌న్ వ‌ర్గాల స‌మాచారం. ఈ దిశ‌గా ఆయ‌న అధ్య‌య‌నం చేస్తున్నారు. కొత్త స‌వంత‌ర్సం నుంచి మార్పుచేర్పులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ట‌.

ఆ నేత‌ల‌కు అవ‌కాశం ఉండేనా..?
తెలంగాణ అధ్య‌క్ష స్థానానికి ఎవ‌రిని నియ‌మించాల‌ని అనుకున్న‌ప్పుడు అభిప్రాయ సేక‌ర‌ణ చేప‌ట్టాల‌ని ఏఐసీసీ నిర్ణ‌యించింది. అధిష్ఠానం దూత‌లు రాష్ట్రానికి వ‌చ్చి అభిప్రాయ సేక‌ర‌ణ జ‌రిపారు. ఇందులో డీసీసీ అధ్య‌క్షుల అభిప్రాయానికి విలువ ఏర్ప‌డింది. 33 జిల్లా అధ్య‌క్షుల్లో అత్య‌ధికులు రేవంత్ వైపే మొగ్గు చూపారట‌. దాదాపు 20 జిల్లాల అధ్య‌క్షులు రేవంత్‌రెడ్డికి జైకొట్టార‌ని తెలిసింది. మిగ‌తా వాళ్ల‌లో ఎక్కువ‌మంది కోమ‌టిరెడ్డి పేరు ప్ర‌తిపాదించార‌ట‌. ఇప్పుడు వీళ్ల‌లో త‌మ‌కు మ‌ళ్లీ అవ‌కాశం వ‌స్తుందో రాదోన‌నే భ‌యం నెల‌కొంద‌ట‌.

కోమ‌టిరెడ్డి వ‌ర్గానికి ప్రాధాన్యం ఉంటుందా..?
ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా, రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, వ‌రంగ‌ల్ జిల్లాల్లో కోమ‌టిరెడ్డికి కొంత ప‌ట్టు ఉంది. ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపులో, డీసీసీ అధ్య‌క్షుల నియామ‌కాల్లో త‌న అనుచ‌ర‌వ‌ర్గానికి ప్రాధాన్యం క‌ల్పించేందుకు ఆయ‌న తీవ్రంగానే శ్ర‌మించే అవ‌కాశం ఉంది. అయితే కోమ‌టిరెడ్డి అంటే ప‌డ‌ని రేవంత్ టీం ఆ ప‌నిచేస్తుందా అనే అనుమానం కార్య‌క‌ర్త‌ల్లో నెల‌కొంద‌ట‌.

కొత్త ర‌క్తం ఎక్కిస్తారా…?
చాలా జిల్లాల్లో కొంత‌మంది అధ్య‌క్షులుగా ఏళ్లుగా తిష్ట వేసి ఉన్నారు. ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి నియ‌మించిన వారు ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నారు. ఇందులో కొంద‌రి ప‌నితీరు ఏమాత్రం బాగాలేద‌ట‌. వీరంద‌రినీ త‌ప్పించి కొత్త ర‌క్తాన్ని ఎక్కించాల‌ని రేవంత్ టీం భావిస్తోంద‌ట‌. ఇందులో 50 ఏళ్ల లోపు యువ‌త‌కు అవ‌కాశం ఉంటుందా అని పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.

ప‌నితీరే ప్రామాణికం..
ప‌నిచేసే వారికే ప్రాధాన్యం ఇవ్వాల‌ని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నార‌ట‌. రేవంత్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లు, పార్టీ కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంలో ఎవ‌రెవ‌రు ఆస‌క్తి చూపారు.., ప్ర‌స్తుతం స‌భ్య‌త్వ న‌మోదులో ఎవ‌రి ప‌నితీరు ఏమిటి.. అనే అంశాల‌ను ప్రామాణికంగా తీసుకొని నియామ‌కాలు చేప‌డ‌తార‌ట‌.

నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జుల‌కు కూడా ఈ అంశాలే గీటురాయిగా భావించి పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించార‌ట‌. 2023 ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా ఎవ‌రైతే ప‌నిచేస్తారో వారినే అంద‌లం ఎక్కించాల‌ని యోచిస్తున్నార‌ట‌. ఇప్పుడు ఉన్న వారిలో ఎంత మందికి డీసీసీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు వ‌స్తాయో.. ఎంద‌రు కొత్త‌వారు వ‌స్తారో.. ఎవ‌రెవ‌రి వ‌ర్గాల‌కు కేటాయింపు ఉంటుందో వేచి చూడాలి.