చంద్రబాబు నిజంగా ఆ మాట అన్నాడా ?

‘‘వరదల వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టం గురించి ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తూ, సహాయ చర్యలకు పురమాయిస్తూ ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుడు నన్ను విమర్శిస్తూ ఉన్నారు. నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని.. ఎక్కడో ఒక చోట శాశ్వతంగా కనుమరుగు అవుతాయని. తనను వ్యతిరేకించిన వైఎస్సార్ గారు కూడా కాలగర్భంలో కలిసిపోయారని అంటున్నారు’’.. ఇదీ చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు.

ఆయన అనుకూల మీడియా దీని గురించి గట్టిగా ప్రచారం చేస్తోంది. సీఎం జగన్ చనిపోవాలని చంద్రబాబు కోరుకున్నారని.. వైఎస్ లాంగే హెలికాఫ్టర్ కూలిపోయి జగన్ కూడా దుర్మరణం పాలవ్వాలని చంద్రబాబు అంటున్నారని ప్రచారం చేస్తున్నారు. వైసీసీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా జగన్ వీడియోను వైరల్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది.

ఐతే తన మీద వ్యక్తిగత వ్యాఖ్యలతో దాడి చేస్తున్నారంటూ కొన్ని రోజుల కిందటే మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు.. ఇంతలో జగన్ గురించి ఇలా ఎలా మాట్లాడారా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు నిజంగా అంత మాటా అన్నారా అని ఆయన వీడియోలను పరిశీలిస్తే తెలిసిన విషయం వేరు. సీఎం జగన్ అన్న మాటలను అసలు చంద్రబాబు అననే లేదు. నిజంగా ఆయన ఏమన్నారో ఒకసారి చూస్తే.. ‘‘రౌతు కొద్దీ గుర్రం అంటారు.

నడిపించేవాడు సక్రమంగా నడిపిస్తే కింద ఉన్న వాళ్లు కూడా సక్రమంగా పని చేస్తారు. అట్టగాకుండా మీరు పైపైన తిరిగితే.. గాల్లో తిరిగితే.. గాలి కబుర్లు చెబితే సమస్యలు పరిష్కారం కావు. వీళ్ల కష్టాలు తీరవు. దయచేసి ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోవాలి. నీకు అధికారం ఉంది. నిన్ను ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత చేయండి’’.. ఇవీ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. కానీ అసెంబ్లీలో ఈ వ్యాఖ్యల్ని పూర్తిగా మార్చి చెప్పి సానుభూతి పొందాలని, చంద్రబాబు ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని జగన్ ప్రయత్నించడం ఆశ్చర్యం కలిగించే విషయం.