కాంగ్రెస్ లో ముసలం వెనుక పీకే ఉన్నాడా ?

మేఘాలయా కాంగ్రెస్ లో తాజా ముసలం వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఉన్నారా ? అవుననే ప్రచారం మొదలైంది. మేఘాలయా కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ సంగ్మా నేతృత్వంలో రెండు రోజుల క్రితమే 12 మంది ఎంఎల్ఏలు తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న 17 మంది ఎంఎల్ఏల్లో ఏకంగా 12 మంది టీఎంసీలో చేరటమంటే మామూలు విషయం కాదు. ఇంత మంది ఒకేసారి తృణమూల్ లో ఎందుకు చేరారు ?

ఎందుకంటే వీళ్ళ చేరిక వెనుక పీకే హస్తముందని ఇపుడు బయటపడింది. కలకత్తాలో ఈ మధ్యనే ముకుల్-పీకే మధ్య భేటీ జరిగిందట. దాని తర్వాతే సడన్ డెవలప్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ముకులే చెప్పటం గమనార్హం. అంటే తమను పీకేనే కాంగ్రెస్ లో నుండి తృణమూల్లో చేరమని చెప్పినట్లు ముకుల్ చెప్పలేదు. కానీ తమ భేటీ తర్వాత తామంతా తృణమూల్లో చేరాలని డిసైడ్ అయినట్లు చెప్పటమంటే ఎవరికైనా ఏమర్ధమవుతుంది.

జాతీయస్ధాయిలో బీజేపీకి వ్యతిరేకంగా సమర్ధవంతమైన ప్రతిపక్షం అవసరమని కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడినట్లు ముకుల్ చెప్పారు. అయినా అధిష్టానం నుండి సానుకూల స్పందన రాలేదన్నారు. ఆ తర్వాతే పీకేతో భేటీ అయినట్లు చెప్పటంతో అందరిలోను పీకే హస్తంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్ధితి అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి నేపధ్యంలో పార్టీలో ఉన్న ఎంఎల్ఏలు కూడా ఇతర పార్టీల్లో చేరిపోతుండటంతో పార్టీ పరిస్ధితి మరింత అన్యాయంగా తయారౌతోంది.

నిజానికి పరిస్ధితులన్నీ అనుకూలించుంటే ఈపాటికి పీకే కాంగ్రెస్ లోనే ఉండేవారు. అయితే అనేక కారణాల వల్ల కాంగ్రెస్ లో పీకే చేరిక ఆగిపోయింది. పీకే అడిగిన పోస్టును ఇవ్వటానికి సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు సీనియర్లలో చాలామంది ఇష్టపడలేదట. దాంతో వ్యవహారం చెడిపోయి కాంగ్రెస్ కు పీకే దూరమైపోయారు. అప్పటినుండి తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీకి బాగా దగ్గరైపోయారు.

అప్పటి నుండే పీకే చూపు కాంగ్రెస్ ఎంఎల్ఏలు, నేతలపై పడిందంటున్నారు. ఈమధ్యనే కాంగ్రెస్ నేతలు కీర్తీ ఆజాద్, అశోక్ తన్వర్ కూడా తృణమూల్లో చేరిన విషయం తెలిసిందే. ఏదేమైనా కాంగ్రెస్ పైన పీకే కోపాన్ని ఆపార్టీ నేతలను తృణమూల్లో చేర్చటం ద్వారా తీర్చుకుంటున్నట్లు అనుమానంగా ఉంది. మరి పీకే కోపం ఎప్పటికి తీరుతుందో చూడాల్సిందే.