‘అల్లు’కుంటున్న నందమూరి బంధం

ఎవరు ఔనన్నా.. ఎవరు ఔనన్నా మెగా, నందమూరి కుటుంబాల మధ్య అంతరం ఉన్న మాట వాస్తవం. ఇరు కుటుంబాల హీరోలకు సంబంధించి ఫ్యాన్స్ అంతా కూడా పరస్పరం వ్యతిరేక భావంతో ఉంటారు. వివిధ సందర్భాల్లో ఇరు కుటుంబాల హీరోల మధ్య సినిమా పరంగా వైరం గట్టిగానే నడిచింది. చిరంజీవి, బాలయ్య తామిద్దరం మంచి మిత్రులం అని కొన్ని వేదికల మీద ప్రకటించుకున్నారు కానీ అభిమానులు మాత్రం అలా ఫీలవ్వరు. సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ఫ్యాన్ వార్స్ జరిగేదే మెగా, నందమూరి అభిమానుల మధ్యనే అన్నది అందరూ అంగీకరించే వాస్తవం.

రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నా, వ్యక్తిగతంగా వాళ్లిద్దరూ ఎంతో సన్నిహితంగా కనిపిస్తున్నా కూడా సినిమాలో ఎవరికి స్క్రీన్ టైం ఎక్కువ, ఎవరు ఎక్కువ హైలైట్ అవుతారు.. ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది అంటూ అభిమానులు చాన్నాళ్ల నుంచి వాదించుకుంటూ ఉన్నారు సామాజిక మాధ్యమాల్లో. ఐతే తారక్ మాత్రం చరణ్, చిరులకు బాగా క్లోజ్ అయ్యాడన్నది ఇన్ సైడ్ టాక్.

ఈ సంగతిలా ఉంటే ఎన్నడూ లేని విధంగా నందమూరి బాలకృష్ణ అల్లు కుటుంబానికి ఈ మధ్య బాగా చేరువ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఆయన అల్లు వారి ‘ఆహా’ ఓటీటీ కోసం అన్ స్టాపబుల్ టాక్ షో చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ కలయిక అసలెవ్వరూ ఊహించనిది. బాలయ్యకు భారీగా పారితోషకం ఇచ్చి ఈ షో చేయించి దాని ద్వారా ‘ఆహా’కు బాగానే ఆదరణ పెంచారు అరవింద్. ఈ సందర్భంగా బాలయ్య, అరవింద్ మధ్య పెరిగిన సాన్నిహిత్యం వారి మధ్య ఓ సినిమాకు కూడా దారి తీస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

ఈ చర్చ ఇలా ఉండగానే బాలయ్య మూవీ ‘అఖండ’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడన్న సమాచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. నిజానికి ఈ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్‌గా వస్తాడని ముందు ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని.. ఈ ఈవెంట్‌కు రాబోయేది బన్నీ అని వెల్లడైంది. ఓవైపు మెగా ఫ్యామిలీ ముద్ర నుంచి బయటికి వచ్చి, సొంత ఇమేజ్ కోసం గట్టిగా ట్రై చేస్తున్న బన్నీ.. ఇప్పుడిలా బాలయ్య మూవీ ఈవెంట్‌కు గెస్ట్‌గా రాబోతుండటం, బాలయ్య అల్లు వారి ఓటీటీ కోసం షో చేయడం.. గీతా ఆర్ట్స్‌లో సినిమాకు కూడా రెడీ అవుతుండటంతో ఈ కొత్త బంధం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.