ప్రభాస్ అభిమానులకు ‘ఆదిపురుష్’ టెన్షన్

‘బాహుబలి’తో ఉత్తరాదిన సైతం తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అతడి క్రేజ్ తాత్కాలికమేమీ కాదని ‘సాహో’ రుజువు చేసింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఆ సినిమా కూడా ఉత్తరాదిన రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. అందుకే ప్రభాస్‌తో సినిమా చేయడానికి బాలీవుడ్ దర్శకుడు, నిర్మాతలు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు.

ఐతే ముందుగా ఈ అవకాశం దక్కించుకున్నది ఓం రౌత్‌యే. ‘తానాజీ’ లాంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన ఈ దర్శకుడు తన సొంత నిర్మాణ సంస్థలో దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్లో ప్రభాస్‌తో గత ఏడాది ‘ఆదిపురుష్’ సినిమాను ప్రకటించాడు. ఐతే ఈ చిత్రం పట్టాలెక్కడంలో కొంత ఆలస్యం జరిగింది. ఐతే లేటుగా షూటింగ్ మొదలైనప్పటికీ.. ఈ భారీ చిత్రాన్ని కొన్ని నెలల వ్యవధిలోనే పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఆ బడ్జెట్, సినిమా కథాంశాన్ని బట్టి షూట్ కోసం ఏడాదో రెండేళ్లో సమయం తీసుకుంటాడనుకుంటే.. ఇంత వేగంగా టాకీ పార్ట్ అంతా అవగొట్టేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్ని రోజుల కిందటే ప్రభాస్ పార్ట్ పూర్తి చేసిన ఓం.. ఇప్పుడు మొత్తంగా షూటింగ్ అవగొట్టేశాడు. ఇంకా ఈ సినిమా విడుదలకు దాదాపు పది నెలల సమయం ఉంది. ఇందులో ఆరు నెలలకు పైగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకే సమయం కేటాయించనున్నాడు. ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో వీఎఫ్ఎక్స్ వర్క్ జరగబోతోంది ఈ సినిమాకే అంటున్నారు.

ఐతే షూటింగ్ మరీ తక్కువ టైంలో అయిపోవడంతో ప్రభాస్ ఇందులో చేయడానికి పెద్దగా ఏమీ లేదా.. మొత్తం గ్రాఫిక్స్ మాయాజాలమే చూడబోతున్నామా అన్న డౌట్లు కొడుతున్నాయి. అసలే అందరికీ తెలిసిన రామాయణ కథ. పైగా ప్రభాస్ నుంచి ‘బాహుబలి’లో చూసిన గూస్ బంప్స్ మూమెంట్స్, హీరోయిజం ఉండకపోవచ్చు. అందులోనూ షూటింగ్ చకచకా అవగొట్టేసి మొత్తంగా గ్రాఫిక్స్ మాయాజాలంతో నింపేసేలా ఉన్నారు. అలాంటపుడు ప్రభాస్ ఇందులో పెద్దగా చేసిందేముంటుంది? అభిమానులు కోరుకునే స్థాయిలో అతను తెరపై కనిపిస్తాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘ఆదిపురుస్’ టీజరో.. ట్రైలరో వస్తే తప్ప సినిమా ఎలా ఉంటుందనే విషయంలో ఒక అంచనాకు రాలేమేమో.