ఒడిశా సీఎంను కలిసిన జ‌గ‌న్

ఏపీ, ఒడిశా ముఖ్య‌మంత్రుల మ‌ధ్య కొన్ని స‌మ‌స్య‌ల‌కు అవ‌గాహ‌న కుదిరింది. తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ఒడిశాకు వెళ్లి.. అక్క‌డ ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న స‌మ‌స్య‌ల‌పై వారు చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో కొన్ని సానుకూల నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇవి రెండు రాష్ట్రాల‌కు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు పేర్కొనడం గ‌మ‌నార్హం. మంగ‌ళ‌వారం ఉద‌యం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌ కార్యక్రమానికి హాజరైన జ‌గ‌న్‌.. అక్కడ నుంచి విశాఖకు, విశాఖ నుంచి భువనేశ్వర్‌ చేరుకున్నారు.

విమానాశ్రయం నుంచి నేరుగా ఒడిశా స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి.. ఒడిశాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆ తర్వాత ఒడిశా సీఎంతో చర్చించాల్సిన అంశాలపై మరో దఫా స్వల్ప సమావేశం నిర్వ‌హించారు. అక్కడ నుంచి నేరుగా ఒడిశా సచివాలయం లోక్‌సేవా భవన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకున్న ఏపీ సీఎంకు ఒడిశా సీఎం న‌వీన్‌..సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. తర్వాత కన్వెన్షన్‌ రూంలో ఇరువురి మధ్య ఆత్మీయ సమావేశం జ‌రిగింది. ఇరు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి చీఫ్‌ సెక్రటరీలతో జాయంట్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

సమస్యల పరిష్కారంపై ఈకమిటీ దృష్టిపెడుతుందని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ముఖ్యంగా కొఠియా గ్రామాల సమస్య, నేరడి బ్యారేజీ, జంఝావతి రిజర్వాయర్‌ ప్రాజెక్టులో మిగిలిపోయిన భాగం పూర్తి లాంటి మూడు ప్రధాన అంశాలతో పాటు వివిధ అంశాల మీద చర్చ జరిగినట్టుగా వెల్లడించారు. పోలవరం కారణంగా పాక్షికంగా ముంపునకు గురవుతున్న ప్రాంతంలో రక్షణ చర్యలపై ఏపీ సీఎం జ‌గ‌న్ కొన్ని సూచనలు చేశారు. బలిమెల, అప్పర్‌ సీలేరులో విద్యుత్‌ప్రాజెక్టుకు సంబంధించి ఎన్‌ఓసీ అంశాలను కూడా చ‌ర్చ‌ల్లో పేర్కొన్నారు. బహుదా రిజర్వాయర్‌ నుంచి ఇచ్ఛాపురంకు నీటి విడుదలపైనా చర్చలు జ‌రిగాయి.

మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ‌, గంజాయి సాగు, రవాణా నివారణపైనా సహకారం కొనసాగించాలని, కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఇరువురు ముఖ్య‌మంత్రులు నిర్ణ‌యించారు. సరిహద్దు జిల్లాల్లో ఒడిశాలో తెలుగు, ఆంధ్రలో ఒడియాకు సంబంధించి లాంగ్వేజ్‌ టీచర్ల నియామకం, పాఠ్యపుస్తకాల పంపిణీ, పరీక్షలు నిర్వహణను సోదరభావం పెంపొందించేందుకు చేపట్టాలని నిర్ణయించారు. ఈ దిశగా అడుగులు వేయడానికి శ్రీకాకుళం జిల్లాలోని అంబేద్కర్, బరంపురం యూనివర్శిటీల ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణ‌యానికి వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా ఏపీ సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల మధ్య పరిష్కృతం కాని అంశాలు ఉన్నాయని తెలిపారు. తొలిసారిగా ఈ అంశాలను పరిష్కరించడానికి అడుగు ముందుకు ప‌డింద‌ని చెప్పారు. ఇరు రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు కావడం సంతోషకరమ‌న్నారు. చీఫ్‌సెక్రటరీలతో ఏర్పాటయ్యే కమిటీ సమస్యల మూలాల్లోకి వెళ్తుంద‌ని, వాటికి పరిష్కార మార్గాలను కనుక్కుంటుందని పేర్కొన్నారు. చర్చలు జరపడమే కాదు, జాయింట్‌ కమిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చినందుకు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌కి ధన్యవాదాలు తెలిపారు.