చంద్ర‌బాబుకు బుద్ధి లేదు.. కొడాలి నాని మ‌ళ్లీ ఫైర్‌

వైసీపీ నాయ‌కుడు, మంత్రి కొడాలి నాని.. మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. త‌న మాట‌ల తూటాల‌తో ఆయ‌న అటు టీడీపీ, ఇటు బీజేపీల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై సంచలన వ్యాఖ్యలే చేశారు. పెట్రో భారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేదే లేదని తేల్చేశారు. “అసలు మేమెందుకు తగ్గించాలి.. తగ్గించి మా ఆదాయాన్ని ఎందుకు కోల్పోవాలి” అని మంత్రి ఎదురు ప్రశ్నించారు. తిరుపతి, బద్వేల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు రాలేదని.. దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ చిత్తుగా ఓడిపోయిందని ఆయన అన్నారు.

ఉపఎన్నికల్లో బీజేపీని ప్రజలు పెట్రోల్‌పోసి తగలబెట్టారని.. ఇలా ఓడిపోయింది కాబట్టే పెట్రో, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించిందని కొడాలి చెప్పుకొచ్చారు. “బీజేపీ అరాచకాల పార్టీ.. కులమతాలు రెచ్చగొట్టే పార్టీ. ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావట్లేదంటే ఎందుకో ఆలోచించాలి. పెట్రోల్‌ ధరల ప్రభావం బీజేపీపై పడింది. బీజేపీ నేతలు ఇంకా భ్రమల్లోనే ఉన్నారు. చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ బుద్ధి రాలేదు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పనిచేసినా జగన్‌ను ఏమీ చేయలేరు” అని అన్నారు.

అంతేకాదు.. “ఏపీలో మేకలు, నక్కలు ఏమీ లేవు.. పులివెందుల పులి జగన్‌. కేంద్రాన్ని అడగాల్సినవి రాష్ట్రాన్ని అడుగుతారా…?. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వ్యాట్‌ తగ్గించేది లేదు” అని నాని తేల్చి చెప్పేశారు. ప్రభుత్వం రేట్లు తగ్గించాలని సిగ్గులేకుండా ఏపీ బీజేపీ ఏదేదో మాట్లాడుతోందని.. క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా పెట్రోలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయో చెప్పాలని మంత్రి ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేంద్రమే పెట్రోల్ రేట్లు తగ్గించాలని కొడాలినాని అన్నారు. త‌మ‌ది ప్ర‌జా ప్ర‌భుత్వ‌మ‌ని.. త‌మ‌ను ప్ర‌శ్నించే ముందు.. కేంద్రాన్ని నిల‌దీయాల‌ని నాని సూచించారు. మొత్తానికి అటు తెలంగాణ‌, ఇటు ఏపీ కూడా.. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించేది లేద‌ని స్ప‌ష్టం చేశాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాలు ఎలా ముందుకు సాగుతాయ‌నేది ఆస‌క్తిగా మారింది.