‘ఇంత దిగజారతారా..?’ కన్నీళ్లు పెట్టుకున్న ప్రకాష్ రాజ్!

టాలీవుడ్ లో ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడుతున్నారు. తాజాగా మంచు విష్ణు ప్యానెల్ పై ప్రధాన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల తీరుపై ఆవేదనతో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

గెలుపు కోసం ఇంత దిగజారతారా..? అని ఆయన నిలదీశారు. ఎన్నికల నియమావళిని మంచు విష్ణు ప్యానెల్ ఉల్లంఘిస్తోందని ప్రకాష్ రాజ్ ఆరోపణలు చేశారు. ‘మా’ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతోందని ఆయన చెప్పారు. ఈ మేరకు తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్‌కు నామినల్‌గా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే సూపర్ స్టార్ కృష్ణ, శరత్ బాబు, పరుచూరి బ్రదర్స్, శారద, లక్ష్మి, కృష్ణంరాజు తదితరుల డబ్బును మంచు ప్యానెల్ కి చెందిన వాళ్లు చెల్లించారని ప్రకాష్ రాజ్ చెప్పారు.

నిన్న సాయంత్రం మంచు విష్ణు తరఫున ఓ వ్యక్తి మొత్తం 56 మంది సభ్యుల తరఫున రూ.28వేలు కట్టారని పత్రాలతో సహా ప్రకాష్ రాజ్ చూపించారు. ఆగంతుకులతో ‘మా’ ఎన్నికలు నిర్వహిస్తామా..? ఇలా గెలుస్తారా..? హామీలు చెప్పి గెలవరా..? ఇంత దిగజారతారా..? ఈ విషయంపై పెద్దలు కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఫిర్యాదుపై ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ రియాక్ట్ అయ్యారు. కరోనా కారణంగా తొలిసారి పోస్టల్ బ్యాలెట్ పెట్టామని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ కి డబ్బు ఎలా చెల్లించాలనే విషయంలో సీనియర్ సభ్యులకు అవగాహన లేక.. మంచు విష్ణుకి ఫోన్ చేశారని చెప్పారు.

దీంతో ఆయన తరఫున వ్యక్తి వచ్చి రూ.28 వేలు చెల్లించారని.. అది రూల్స్ కి వ్యతిరేకమని అన్నారు. దీంతో మొత్తం డబ్బుని వెనక్కి ఇచ్చేశామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్ రద్దు చేసే ఛాన్స్ లేదని అన్నారు.