లవ్ స్టోరికి టికెట్ల రేట్ల పెంపు?

మంచి క్రేజున్న సినిమాలు రిలీజైనపుడు తొలి వారం అదనపు షోలు వేయడం, టికెట్ల రేట్లు పెంచుకోవడం ఒకప్పుడు చాలా మామూలు విషయమే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా ఈజీగా ఇందుకు అనుమతులు వచ్చేసేవి. కానీ గత ఏడాదిన్నరలో పరిస్థితులు చాలా మారిపోయాయి. కరోనా మహమ్మారి పుణ్యమా అని థియేటర్లు నడవడం.. పేరున్న సినిమాలు రిలీజవడమే తగ్గిపోయింది.

థియేటర్ల పున:ప్రారంభం తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావడమూ తగ్గించారు. గత నెలన్నర వ్యవధిలో బోలెడన్ని సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి కానీ.. దేనికీ ఆశించిన స్పందన రాలేదు. ఎట్టకేలకు ‘లవ్ స్టోరి’ లాంటి భారీ అంచనాలున్న సినిమా థియేటర్లలోకి వస్తుండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో బుకింగ్స్ తెచ్చిన థియేటర్లలో జోరుగా టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇది ఇండస్ట్రీకి ఉత్సాహాన్నిస్తున్న విషయమే.

ఐతే ‘లవ్ స్టోరి’ పట్ల ప్రేక్షకుల స్పందన చూసేసరికి నిర్మాతల్లో టికెట్ల రేట్ల పెంపు ఆశలు పుట్టినట్లు సమాచారం. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికే విన్నవించుకోవడం కూడా జరిగిందట. మల్టీప్లెక్సుల్లో రూ.200, సింగిల్ స్క్రీన్లలో రూ.150 రేట్లతో తొలి వారం టికెట్లు అమ్మాలని చూస్తున్నారట. ఈ సినిమా నిర్మాత అయిన ఏషియన్ సునీల్‌ మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం, ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలుండటంతో అటు నుంచి సానుకూలంగానే స్పందించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఐతే కరోనా దెబ్బకు ప్రేక్షకులు థియేటర్లకు రావడమే తగ్గించేసిన సమయంలో లేక లేక ఓ సినిమా పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తుంటే ఇలా రేట్లు పెంచి వారిని నిరుత్సాహపరచడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తడం సహజం. ఓపక్క ఏపీలో ఉన్న రేట్లే తగ్గించేసి థియేటర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. పాత రేట్లతో టికెట్లు అమ్ముకుంటే చాలని చూస్తున్నారు. అలాంటిది తెలంగాణలో ఉన్న రేట్లను పెంచి అమ్మితే ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు.