కోన గారి ‘వైజాగ్’ ప్రమోషన్

కోన వెంకట్‌ ‘రైటర్’ అనే ముద్ర తొలగించుకుని చాలా కాలం అయింది. ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలతో కాంబినేషన్లు సెట్ చేయడం, బాగా డబ్బులున్న నిర్మాతలతో పెట్టుబడి పెట్టించడం.. సమర్పకుడిగా వ్యవహరిస్తూ వాటా తీసుకోవడం ఇలా నడుస్తోంది ఆయన వ్యవహారం. ఆయన తరచుగా ఎంవీవీ సత్యనారాణ నిర్మాణంలో సినిమాలు చేస్తుంటాడన్న సంగతి తెలిసిందే.

పారిశ్రామిక వేత్త అయిన ఈయన.. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి అనూహ్య విజయం సాధించారు. కోన వెంకట్ సైతం వైకాపా మద్దతుదారు అన్న సంగతి తెలిసిందే. ఆయన బాబాయి కోన రఘుపతిరావు బాపట్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగుతున్నారు. కోన, ఎంవీవీలది ఒకప్పుడు సినిమా బంధమే కానీ.. గత ఎన్నికల సందర్భంగా రాజకీయంగానూ వారి బంధం బలపడింది.

ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ‘గల్లీ రౌడీ’ సినిమాను నిర్మించారు. ఎప్పట్లాగే ఎంవీవీ పెట్టుబడి పెడితే.. మిగతా వ్యవహారాలన్నీ కోన చూసుకున్నాడు. ఈ సినిమా పూర్తిగా ఎంవీవీ అడ్డా అయిన విశాఖపట్నం నేపథ్యంలోనే నడుస్తుంది. షూటింగ్ కూడా అక్కడే చేశారు. సినిమాలో అంతా కూడా వైజాగ్ ప్రమోషన్ ఓ రేంజిలో జరిగింది. తన నిర్మాణంలో వచ్చిన గత సినిమాల్లాగే ఎంవీవీ సత్యనారాయణ ఇందులోనూ ఒక క్యామియో చేసి ముచ్చట తీర్చుకున్నారు. ఇంత వరకు ఓకే కానీ.. సినిమా చివర్లో వచ్చే ఒక డైలాగ్ ఓ వర్గానికి నచ్చట్లేదు.

ఏపీ రాజధాని విషయంలో నెలకొన్న వివాదం తెలిసి కూడా.. వైకాపా మద్దతుదారే అయిన పోసాని కృష్ణమురళితో త్వరలోనే వైజాగ్ రాజధాని కాబోతోందంటూ డైలాగ్ చెప్పించి ఈ సినిమా ద్వారా ఆ సిటీని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. అమరావతి రైతులు, దాని మద్దతుదారులను కవ్వించడం కాకపోతే ఈ సినిమాలో ఆ డైలాగ్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో మరి.