నరేష్ వ్యాఖ్యలపై నట్టి కుమార్ అసహనం

హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌పై మా అధ్యక్షుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తేజూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో నరేష్ ఈ విధంగా స్పందించడం ఏమిటని కొందరు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తేజూ ప్రమాదంపై నరేష్ స్పందనను నిర్మాత నట్టికుమార్ తప్పుపట్టారు. ఇటువంటి సందర్భంలో నరేష్‌ రేసింగ్ గురించి మాట్లాడటం సరి కాదని అన్నారు.

తేజూకు చికిత్స విజయవంతమై, ఆయన కోలుకుని తిరిగి షూటింగ్స్ లో పాల్గొనాలని అందరం దేవుడిని ప్రార్థిద్దామని నట్టికుమార్ అన్నారు. ఈ సమయంలో రాజకీయాలు వద్దని, రాజకీయాలు చేయాలని చూడవద్దని కోరారు. నరేష్ గారు పెద్దవారని, కానీ, ఈ సందర్భంలో ఆయన మాట్లాడింది తనకు నచ్చలేదని కరాఖండిగా చెప్పేశారు నట్టికుమార్. ఈ సమయంలో రేసింగ్ వ్యవహారం తెరపైకి తీసుకురావడం కరెక్ట్ కాదని, అయినా, తేజూ రేసింగ్‌ చేయట్లేదని, మామూలు డ్రస్‌లో వెళుతున్నారని గుర్తుచేశారు.

తేజూ వెళుతున్న స్పీడ్ కూడా తక్కువ లోనే ఉందని, దురదృష్టవశాత్తూ బ్రేక్ వేసిన చోట ఇసుక ఉండటం వల్ల స్కిడ్ అయి ప్రమాదం జరిగిందని చెప్పారు. తేజూ తన ఇంటి నుంచి నరేష్ ఇంటికి వెళుతున్నట్లు కనిపిస్తోందని, నరేష్ చెబుతున్నది రాంగ్ అనిపిస్తోంనది నట్టికుమార్ అభిప్రాయపడ్డారు. దయచేసి రేసింగ్ వంటి విషయాలు ఇక్కడితో వదిలేసి తేజూ బాగుండాలని కోరుకుందామని నట్టికుమార్ అన్నారు. మరి, నట్టికుమార్ వ్యాఖ్యలపై నరేష్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.