జాతిరత్నాలు డైరెక్టర్ ‘పాన్’ మసాలా

జాతిరత్నాలు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు యువ దర్శకుడు కేవీ అనుదీప్. చాలామంది ఇదే అతడి తొలి చిత్రం అనుకున్నారు కానీ.. దానికంటే ముందు అతను ‘పిట్టగోడ’ అనే లవ్ స్టోరీ తీశాడు. ఆ సినిమా వచ్చింది, వెళ్లిది కూడా జనాలకు తెలియదు. అలాంటి సినిమా తర్వాత వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద బేనర్లో అవకాశం దక్కించుకుని పేరున్న ఆర్టిస్టులతో ‘జాతిరత్నాలు’ తీశాడు. ఆ సినిమాకు ఎంత మంచి ఫలితం దక్కిందో తెలిసిందే. దీంతో ఒక్కసారిగా హాట్ షాట్ డైరెక్టర్లలో ఒకడిగా మారిపోయాడు.

తనతో సినిమా చేయడానికి టాలీవుడ్లో చాలామంది హీరోలు ఎదురు చూస్తుంటే.. అనుదీప్ మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా ఓ తమిళ హీరోతో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఆ హీరోనే.. శివ కార్తికేయన్. మన రవితేజ లాగే తమిళంలో చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి పెద్ద రేంజికి ఎదిగాడు శివకార్తికేయన్. తెలుగు ప్రేక్షకులకు అతను పెద్దగా తెలియదు.

ఐతే ఈ మధ్య వరుసగా తమిళ స్టార్లందరూ తెలుగు డైరెక్టర్లతో బహు భాషా చిత్రాలు చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ధనుష్, విజయ్ లాంటి స్టార్లు ఇప్పటికే తెలుగు దర్శకులతో సినిమాలు ఖరారు చేసుకున్నారు. ఈ కోవలోనే శివ కార్తికయన్.. అనుదీప్‌తో సినిమా చేయనున్నట్లు చెబుతున్నారు.

ధనుష్-శేఖర్ కమ్ముల సినిమాను నిర్మిస్తున్న ఏషియన్ మూవీస్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మధ్యలో ‘జాతిరత్నాలు’ సీక్వెల్ అని.. ఇంకో ప్రాజెక్టని అనుదీప్ తర్వాతి సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి కానీ.. అతను చివరికి శివతోనే సినిమాను ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలన్నది ప్లాన్. తన తొలి రెండు చిత్రాలకు భిన్నంగా ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ తీయడానికి అనుదీప్ రెడీ అవుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు.