జగన్ చెబుతుందేమిటి.. మీరు చేస్తుందేమిటి

“మ‌నం అధికారంలో ఉన్నాం. అంద‌రూ మ‌న‌వైపు చూస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాలంటే.. ఐక‌మ‌త్యంగా ఉండాలి. క‌లిసి మెలిసి ప‌నిచేయాలి. పార్టీని గెలిపించాలి”- ఇదీ.. పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్న మాట‌. నేత‌లకే కాదు.. జిల్లాల ఇంచార్జ్ మంత్రుల‌కు కూడా ఇదే ఆయ‌న చెబుతున్నారు. కానీ, ఎక్క‌డ లోపం జ‌రుగుతోందో తెలియ‌డం లేదు కానీ, చాలా జిల్లాల్లో మంత్రులు విఫ‌ల‌మ‌వుతున్నారు.

ప్ర‌స్తుతం తెర‌ మీదికి వ‌చ్చిన ఒక్క అనంత‌పురం మాత్ర‌మే కాదు.. శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లోనూ అక్క‌డ ఇంచార్జ్ మంత్రులు ఫెయిల్ అవుతున్నారు. నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త‌ను పెంపొందించ‌డంలో వారు పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు. ఫ‌లితంగా ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య ధోర‌ణి పెర‌గ‌డంతోపాటు.. ఎమ్మెల్యేల‌కు స్థానికంగా ఉన్న నాయ‌కుల‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగిపోయింది.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌నిచేసిన వారిని ప‌ట్టించుకోక‌పోవ‌డం పెద్ద ఇబ్బందిగా మారింది. పార్టీ అధికారంలో ఉంద‌ని.. త‌మ‌కు ప‌నులు అవుతాయ‌ని నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ.. ఇప్ప‌టికే మూడున్న‌రేళ్లు గ‌డిచిపోయింది. అయితే.. ఒక్క ప‌నికూడా జ‌ర‌గ‌లేదు. ఇదీ.. వారి ఆవేద‌న మ‌రో ఏడాదిలో ఎన్నిక‌ల వేడి రాజుకుంటుంది. ఇక‌, అప్పుడు మ‌ళ్లీ ఎన్నిక‌ల‌య్యాక చూద్దామ‌నే మాట ఎలానూ చెబుతారు. అందుకే ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేల‌కు, మంత్రుల‌కు కూడా టికెట్లు ఇవ్వొద్ద‌ని బాహాటంగానే చెబుతున్నారు. శ్రీకాకుళంలో మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుకు మామూలుగా సెగ త‌గ‌ల‌డం లేదు. ఇక‌, విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు కూడా ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. మైల‌వ‌రంలోనూ సొంత నేత‌ల మ‌ధ్య వివాదాలు తార‌స్థాయికి చేరాయి.

విజ‌య‌వాడ తూర్పులో నాయ‌కులు స‌హాయ నిరాక‌ర‌ణ ప్ర‌క‌టించారు. ఇలా రాష్ట్రంలో సుమారు 25 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఇలానే ఉంద‌ని ఒక అంచ‌నా. మ‌రి వీటిని ఎవ‌రు దారిలో పెడ‌తారు? ఎప్ప‌టికి దారికి తెస్తారు? అనేది చూడాల్సి ఉంటుంది.