ఆటో జానీని మర్చిపోలేదు

రాజకీయాల నుంచి సుదీర్ఘ విరామం తీసుకుని తిరిగి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఖైదీ నెంబర్ 150తో పాటు వేరే కథలు చాలా విన్నారు మెగాస్టార్ చిరంజీవి. అందులో దర్శకుడు పూరి జగన్నాధ్ చెప్పిన ఆటో జానీ కూడా ఉంది. 1992లో వచ్చిన రౌడీ అల్లుడులోని ఐకానిక్ పాత్రను తీసుకుని ఊర మాస్ క్యారెక్టరైజేషన్ తో దాన్ని రాసినట్టు అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. అయితే సెకండ్ హాఫ్ విషయంలో చిరుతో పాటు చరణ్ ని కన్విన్స్ చేయడంతో పూరి ఫెయిలయ్యారు. అప్పుడాయన ఉన్న ట్రాక్ రికార్డుకి రిస్క్ చేసేందుకు తండ్రి కొడుకులు సిద్ధపడలేదు. ఫలితంగా ఆ ప్రాజెక్ట్ ఫ్యాన్స్ మధ్య కేవలం డిస్కషన్ గా మిగిలింది

అప్పటి నుంచి అభిమానులు ఈ కాంబో కుదిరితే బాగుండునని కోరుకుంటూనే ఉన్నారు. గాడ్ ఫాదర్ ప్రమోషన్ లో భాగంగా పూరి చిరంజీవి ఇన్స్ టా వేదికగా చేసిన ఇంటర్వ్యూలో మరోసారి దీని ప్రస్తావన వచ్చింది. లైగర్ డిజాస్టర్ తర్వాత సోషల్ మీడియాకు దూరంగా వెళ్ళిపోయి ఎవరికీ దొరక్కుండా ఇల్లు ఆఫీస్ కే పరిమితమైన పూరి వీడియో రూపంలో అయినా పబ్లిక్ లోకి వచ్చింది ఈ గాడ్ ఫాదర్ కోసమే. ఇందులోనే ఆటో జానీని మించిన స్క్రిప్ట్ తో త్వరలోనే కలుస్తానని నొక్కి చెప్పడం మెగా ఫ్యాన్స్ కి కొత్త జోష్ ఇచ్చింది. ఎన్ని ఫ్లాపులు తీసినా సరైన కథ పడితే పూరి బ్లాక్ బస్టర్ కొడతాడనే నమ్మకం మూవీ లవర్స్ లో ఉంది.

ఎలాగూ చిరంజీవి దర్శకుల ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా సబ్జెక్టు నచ్చితే చాలు ఓకే చెబుతున్నారు. లేకపోతే ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ కు భోళా శంకర్ ఎలా ఇస్తారు. సర్దార్ గబ్బర్ సింగ్ దారుణంగా దెబ్బ తిన్నా, వెంకీ మామ యావరేజ్ గా ఆడినా బాబీకి వాల్తేర్ వీరయ్య ఎందుకు చేశారు. సో పూరి జగన్నాథ్ అంత పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో రావాలే కానీ గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు. పైగా గాడ్ ఫాదర్ లో కీలకమైన జర్నలిస్ట్ పాత్రను చక్కగా పండించిన అభిమానం మెగాస్టార్ కు ఎలాగూ ఉంది. మరి నిజంగా పూరి కనక అన్నంత పని చేస్తే పండగే.