రాజమౌళి కోసం మహేష్ త్యాగం?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పట్నుంచో కలిసి సినిమా చేయాలని కోరుకుంటున్న దర్శకుడు రాజమౌళి. దశాబ్దం కిందటే మహేష్.. రాజమౌళి ప్రాజెక్టు గురించి మాట్లాడాడు. రాజమౌళితో సినిమా చేయడంపై ఆసక్తి ప్రదర్శించాడు. తామిద్దరం కలవబోతున్నట్లు కూడా సంకేతాలు ఇచ్చాడు. కానీ రకరకాల కారణాల వల్ల ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు మహేష్.. జక్కన్నతో జట్టు కట్టబోతున్నాడు.

వీరి కలయిక గురించి రెండు మూడేళ్ల కిందటే వార్త బయటికి వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మహేష్‌తోనే తన సినిమా అని రాజమౌళి కూడా ధ్రువీకరించాడు. ఈ సినిమా కోసం విజయేంద్ర ప్రసాద్ కథ తయారు చేయడానికి గట్టిగానే కసరత్తు చేస్తున్నాడు. కాకపోతే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్నదే క్లారిటీ లేదు. మహేష్ ‘సర్కారు వారి పాట’ను పూర్తి చేసి త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉన్న నేపథ్యంలో అతడితో ప్రాజెక్టు కంటే ముందు బాలీవుడ్లో తక్కువ టైంలో ఒక సినిమా లాంగించేయాలని రాజమౌళి చూస్తున్నట్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.

ఐతే రాజమౌళి ఎంత చిన్న స్థాయిలో, ఎంత ఫాస్టుగా సినిమా తీద్దామనుకున్నా.. రంగంలోకి దిగాక దాని స్కేల్ మారిపోవడం, ఆలస్యం కావడం సహజమే. కాబట్టి రాజమౌళి వేరే సినిమా మొదలుపెడితే మాత్రం మహేష్‌కు ఎదురు చూపులు తప్పవేమో. అయినా సరే.. జక్కన్న సినిమాకు మహేష్ ఎక్కడ లేని ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు ఏ రకమైన ఇబ్బందీ ఉండకూడదన్న ఉద్దేశంతో త్రివిక్రమ్ సినిమా తర్వాత ఏ కమిట్మెంట్ ఇవ్వట్లేదట సూపర్ స్టార్.

అల్లు అరవింద్, మధు మంతెన కలిసి నితీశ్ తివారి దర్శకత్వంలో చేయాలనుకుంటున్న మెగా మూవీ ‘రామాయణం’ కోసం మహేష్ బాబును అడిగితే తానా సినిమా చేయలేనని చెప్పేశాడట మహేష్. రామాయణంపై భారీ సినిమా అంటే చాలా టైం పడుతుందని.. దీనికి ఓకే చెబితే రాజమౌళితో తన చిత్రానికి ఇబ్బంది అవుతుందని.. అందుకే ఈ సినిమాకు మహేష్ నో చెప్పేశాడని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తుండటం విశేషం. దీన్ని బట్టి జక్కన్నతో సినిమాకు మహేష్ ఇస్తున్న ప్రాధాన్యం ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు.