రామ్, రావణ్ రెడీ.. మరి సీత?

ఎవరు ఎన్నిసార్లు పారాయణం చేసినా రామాయణం కొత్తగా అనిపిస్తుంది అంటుంటారు పెద్దలు. అది బాలీవుడ్ వారికి బాగా అర్థమైనట్టుంది. అందుకే అందరూ రామాయణం ఆధారంగా కథలు అల్లేస్తున్నారు. వాళ్లు తీస్తున్నారు కదా మీరెందుకు అని ఎవరిని అడిగినా రామాయణం అందరిదీ అంటున్నారు.

త్వరలో రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్ కూడా రామ రావణులుగా కనిపించడానికి రెడీ అవుతున్నారు. మధు మంతెన, నమిత్ మల్హోత్రా, అల్లు అరవింద్ కలిసి భారీ బడ్జెట్తో మూడు భాగాలుగా త్రీడీ రామాయణం తీయబోతున్నట్టు ప్రకటించి చాలా కాలమైంది. కానీ కరోనా కారణంగా లేటవుతూ వచ్చింది. ఎట్టకేలకి ఇప్పుడా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కబోతోంది. రాముడిగా రణ్‌బీర్, రావణుడిగా హృతిక్ కనిపించబోతున్నారు. వీళ్లిద్దరూ రీసెంట్‌గా నమిత్ ఆఫీసులో కలిసి చర్చలు కూడా నడిపారు.

ఆల్రెడీ ప్రభాస్‌ని రాముడిగా, సైఫ్‌ అలీ ఖాన్‌ని రావణుడిగా పెట్టి ‘ఆదిపురుష్’ తీస్తున్నాడు ఓం రౌత్. కొన్ని వందల కోట్లు పెట్టి మరీ ప్రెస్టీజియస్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. వచ్చే యేడు ప్యాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కానుంది. మరోవైపు అలౌకిక్ దేశాయ్, విజయేంద్ర ప్రసాద్‌ కలిసి సీత కథతో సినిమా తీయబోతున్నారు. అంటే రామాయణాన్ని బేస్ చేసుకుని వస్తున్న మూడో సినిమా ఇది.

ప్రస్తుతం సీత పాత్ర ఎంపికలో ఉంది టీమ్. ‘ఆదిపురుష్‌’లో కృతీ సనన్, అలౌకిక్ మూవీలో కంగనా రనౌత్ సీతాదేవిగా దర్శనమివ్వబోతున్నారు. ఈ సినిమా విషయంలో మాత్రం మొదటి నుంచీ దీపికా పదుకొనె పేరు వినిపిస్తోంది. అయితే ఆమె ఆల్రెడీ ‘మహాభారత్‌’లో ద్రౌపది పాత్ర చేస్తోంది. సీతగా చేయడానికి ఒప్పుకుంటుందో లేదో మరి.