చంద్ర‌బాబు ఇంటిపై రాళ్ల దాడి.. ఉద్రిక్త‌త‌.. ఏం జ‌రిగింది?

టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ దాడిలో టీడీపీ నేత‌లు స‌హా.. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారితీసిన ఈ ఘ‌ట‌న వివ‌రాలు.. ఇవీ.. గురువారం టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. మాజీ స్పీక‌ర్‌.. దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద‌రావు వ‌ర్ధంతి జ‌రిగింది. దీనిని పుర‌స్క‌రించుకుని.. ప‌లువురు నాయ‌కులు గుంటూరు జిల్లా న‌కిరిక‌ల్లులో వ‌ర్ధంతి కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన మాజీ మంత్రి ఉత్త‌రాంధ్ర నాయ‌కుడు.. చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు.. సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర‌స్తాయిలో విరుచుకుపడ్డారు.

‘‘చెత్తనాకొ… ఈ రోజున రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ముఖ్యమంత్రి మద్యం, మాంసం, చేపలు అమ్ముతాడా..! చెత్త, మరుగుదొడ్లపై పన్ను వేసే వాడిని చెత్త నా కొ… అనక ఏం అంటారు?’’ అని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. ఇది.. ఇప్పుడు వివాదానికి దారితీసింది. అయ్య‌న్న వ్యాఖ్య‌ల‌పై చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేస్తూ.. కృష్నాజిల్లా పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్ ఆధ్వ‌ర్యంలో టీడీపీ నాయ‌కులు.. ఉండ‌వ‌ల్లిలోని టీడీపీ అధినేత నివాసానికి వెళ్లి.. ధ‌ర్నా చేప‌ట్టారు. అయితే.. ఈ విష‌యం తెలిసి.. టీడీపీ నాయ‌కులు బుద్ధా వెంక‌న్న ఆధ్వ‌ర్యంలో అక్క‌డ‌కు వెళ్లి అడ్డుకున్నారు.

ఈ క్ర‌మంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇది తోపులాట‌కు కూడా దారి తీసింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు బాబు ఇంటికి వద్దకు చేరుకుంటున్నారు. బాబు ఇంటిపై దాడికి యత్నించడంతో టీడీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ క్ర‌మంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పృహ తప్పి పడిపోయారు. వైసీపీ నేతలు దాదాపు పది కార్లతో రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారని టీడీపీ నేతలు వాపోయారు.

చంద్రబాబు ఇంటి వద్ద జోగి రమేష్, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ నాయకులకు డీజీపీ కూడా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేద నన్నారు. పట్టాభి మాట్లాడుతూ ఫ్యాక్టనిస్టు సీఎం అయితే ఇలానే ఉంటుందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు ముందుగానే ప్రకటించి దాడికి పాల్పడుతుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ప్రశ్నించాయి. సీఎం ప్రోద్భలంతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. మొత్తానికి ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడం గ‌మ‌నార్హం.