ష‌ర్మిల‌ది ముందుచూపా? భ‌య‌మా?

Sharmila

రాజ‌న్న రాజ్యం తేవ‌డ‌మే లక్ష్య‌మ‌ని త‌న తండ్రి దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పేరుతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన వైఎస్ ష‌ర్మిల‌కు ఆరంభం నుంచి ఆటుపోట్లు త‌ప్ప‌ట్లేదు. తెలంగాణ‌లో త‌న తండ్రి పేరుతో పార్టీ పెడితే వైఎస్‌కు విధేయులుగా కొన‌సాగిన నేత‌లు అభిమానులుగా ఉన్న కార్య‌క‌ర్త‌లు త‌న పార్టీలోకి పెద్ద సంఖ్య‌లో వ‌స్తార‌ని ఆశించిన ఆమె ఆశ‌లు తీర‌లేదు. పార్టీలోకి ఎలాంటి వ‌ల‌స‌లు చేరిక‌లు లేవు. కీల‌క నేత‌లు ఆ పార్టీ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌డం లేదు. పైగా ఆ పార్టీలో మొద‌టి నుంచి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఇందిరా శోభ‌న్ లాంటి ప్రధాన నేత‌లే ష‌ర్మిల‌కు గుడ్‌బై చెప్పి వెళ్లిపోయారు.

రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య‌ను నెత్తినెత్తుకొని వారానికో చోట నిర‌స‌న దీక్ష చేస్తున్న ఆమెకు అనుకున్న స్థాయిలో పొలిటిక‌ల్ మైలేజీ రావ‌డం లేదు. అధికార టీఆర్ఎస్ స‌హా కాంగ్రెస్ బీజేపీ పార్టీలో ఆమెను రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా ప‌రిగ‌ణించ‌డం లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు త‌న కూతురి రాజ‌కీయ కెరీర్‌కు వేగాన్ని ఇచ్చే దిశ‌గా వైఎస్ సంస్మ‌ర‌ణ స‌భ పేరుతో విజ‌యమ్మ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం వ‌ల్ల ష‌ర్మిల‌కు ఎలాంటి మేలు జ‌ర‌గ‌లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆమె ఇక ఈ నెల‌లో పాద‌యాత్ర మొద‌లెట్ట‌నున్నార‌నే స‌మాచారం ఉంది. ఆమెకు మిగిలిన మార్గం అదొక్క‌టేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

మ‌రోవైపు త‌న పార్టీని అంతర్గ‌తంగా బ‌లోపేతం చేయ‌డంపై ష‌ర్మిల దృష్టి సారించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పార్టీలో నుంచి నేత‌లు బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఆమె జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ని ఆ దిశ‌గా వ్యూహాలు ర‌చిస్తున్నార‌ని తెలిసింది. తాజాగా తుంగ‌తుర్తి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా త‌మ పార్టీ నేత ఏపూరి సోమ‌న్న పేరును ఆమె ప్ర‌క‌టించడం ఈ వ్యూహంలో భాగ‌మేన‌ని రాజ‌కీయ నిపుణులు అనుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమ‌ల‌గిరిలో ఆదివారం నిర్వ‌హించిన ద‌ళిత‌భేరి బ‌హిరంగ స‌భ‌లో ఆమె తుంగ‌తుర్తి వైతేపా అభ్య‌ర్థిగా ఏపూరి సోమ‌న్న పేరును ప్ర‌క‌టించారు.

తెలంగాణ‌లో బ‌ల‌మైన కేసీఆర్‌తో స‌హా ప‌టిష్ఠంగా ఉన్న కాంగ్రెస్ బీజేపీల‌తో ఢీకొట్టి అధికారం ద‌క్కించుకోవాల‌నే ఉద్దేశంతో అడుగులు వేస్తున్న ష‌ర్మిల వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాన‌నే సంకేతాల‌ను ఇప్పుడు పంపించింద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఉన్న నేత‌ల‌ను కాపాడుకుంటూనే ప్ర‌త్య‌ర్ఙి పార్టీల‌కు స‌వాలు విసిరేందుకు ఆమె సిద్ధ‌మైంద‌ని నిపుణులు చెబుతున్నారు.